వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో సహకార వ్యవస్థను పటిష్టం చేశాం. ధాన్యం కొనుగోళ్లు సహకార సంఘాలకు అప్పగించిన తర్వాత అవి బలపడ్డాయి అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరయ్యారు.
గోపాల్ పేట మండలం మున్ననూర్ గ్రామంలో పింఛన్లు, బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన అనంతరం చెన్న కేశవ స్వామి దేవాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సహకార రంగం అప్పులు ఇవ్వడానికి ఏర్పాటు చేయలేదు. అప్పుల ఊబి నుంచి రైతాంగాన్ని బయట పడేయడానికి ఏర్పాటు చేసిందన్నారు.
ఇన్నేండ్లలో ఏ పాలకుడు రైతు గురించి ఆలోచించ లేదు. తెలంగాణ రాష్ట్రంలో రైతు ఇంటికి వెళ్లి రైతుబంధు పథకం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి దేశం ఆశ్చర్యపోతుందన్నారు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేస్తాం. వ్యాపారులకు రుణం ఇచ్చే స్థాయికి రైతులు ఎదగాలి అన్నది ప్రభుత్వ ఆలోచన అన్నారు. రైతులు పంటల మార్పిడి మీద దృష్టి సారించాలన్నారు.పేదలు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.