స్టేషన్ ఘన్పూర్, జూలై 23: ‘కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వ్యవసాయ రంగానికి జీవనాడి. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను నింపుకొనే అవకాశం కలిగింది. ప్రకృతి కరుణించి వర్షాలు పడుతున్నాయి కాబట్టి నీరును లిఫ్ట్ చేయడం లేదు. వర్షాలు లేనప్పడు ఈ నీరే ఆధారం’ అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శనివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు చింతకుంట్ల నరేందర్రెడ్డి నివాసంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన కడియం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సొంత నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకొంటే జాతీయ హోదా ఇవ్వకుండా, మెచ్చుకోకుండా, అర్హత లేదని అంటున్నారని బీజేపీపై మండిపడ్డారు. గత 500 ఏండ్లలో ఎన్నడూ రానివిధంగా వరదలు వచ్చి ప్రాజెక్టు మునిగిపోతే దాన్ని కూడా ఆ పార్టీ రాజకీయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు మునిగిపోయిన సందర్భాన్ని కడియం గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదని ఉత్తమ్కుమార్ రెడ్డి అనటం బట్టి.. ఆయనకు ప్రాజెక్టుపై కొంచెం కూడా అవగాహన లేదని, ఇంత తెలివి తక్కువవాడిని తాను చూడలేదని ఎద్దేవా చేశారు. ‘ఈ ప్రాజెక్టు ద్వారా 110 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేశాం. ఇంత నీరు ఎవరు తాగారు? ఇక్కడి నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు, అక్కడి నుంచి లోయర్ మానేర్కు నీళ్లను తీసుకొచ్చి, ఇక్కడి నుంచి కాకతీయ కెనాల్ ద్వారా సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని చివరి ఎకరానికి సాగునీరు అందుతున్నదని తెలిపారు. ఇది ఉత్తమ్కుమార్రెడ్డికి కనిపించలేదా?’ అని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్న మోదీ సర్కారుపై కడియం మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. మహారాష్ట్ర తరహాలోనే ఏక్నాథ్షిండేలు తెలంగాణలో కూడా వస్తారని బీజేపీ నేతలు బలుపుతో మాట్లాడుతున్నారని కడియం మండిపడ్డారు. ‘ఒక్కసారి కేసీఆర్ను టచ్ చేసి చూడండి. కరెంటు తీగను పట్టుకొన్నవాడిలా మాడి మసై పోతారు’ హెచ్చరించారు. కార్యక్రమంలో రూరల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బెలిదె వెంకన్న, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.