ఖమ్మం : కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్ ఖమ్మం జిల్లాలో 100% పూర్తి చేసిన జిల్లా యంత్రాంగాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. జిల్లాలో 100% వాక్సినేషన్ మొదటి డోస్ పూర్తి స్థాయిలో అందించిన సందర్భంగా జడ్పీ హాల్లో నిర్వహించిన అభినందన కార్యక్రమానికి ముఖ్య అతితిగా హాజరై మాట్లాడారు.
మొదటి డోస్ వ్యాక్సినేషన్ను విజయవంతంగా పూర్తి చేయడానికి గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు పని చేసిన సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పని చేశారు. వారి సహకారంతోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తి చేశారని అందుకు వారికి అభినందనలు తెలియజేశారు.
కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జిల్లా యంత్రంగం, సిబ్బంది సాహసోపేతంగా పని చేశారని గుర్తు చేశారు. రెండో డోసు వేయించుకోవాల్సిన వారు నిర్ణీత సమయానికల్లా వేయించుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న వేళ రెండో డోసుని అందరూ తప్పకుండా వేయించుకోవాలని, బూస్టర్ డోస్ కూడా త్వరలో అందుబాటులోకి రానుందన్నారు.
ప్రజలకు కరోనా టీకాలు వేయటంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ కుమార్ అన్నారు. ఫిజికల్ డిస్టెన్స్ తో పాటు ప్రతి ఒక్కరు మస్కులు తప్పక ధరించాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్ప్రేడర్స్ కు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమంలో కూడా ఖమ్మం జిల్లానే ముందంజలో నిలిచిందన్నారు.
తమ ప్రాణాలను పణంగా పెట్టి ఖమ్మం జిల్లా ప్రజలకు తమ సేవలను అందించిన వైద్యాధికారులు, సిబ్బంది, పంచాయతీ, అంగన్వాడీ, మున్సిపల్ తదితర శాఖ సిబ్బందిని మంత్రి అభినందించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో అతి తక్కువ నష్టంతో ఈ మహమ్మారిని ఎదుర్కోగలలిగామన్నారు. 100% వాక్సిన్ పూర్తి చేసిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఉత్తమ సిబ్బందిని శాలువతో సత్కరించారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పునుకొల్లు నీరజ, సూడా చైర్మన్ విజయ్, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఎంహెచ్వో మాలతి సిబ్బంది ఉన్నారు.