Telangana | తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జూన్ 2న ఉదయం 9.30గంటలకు గన్పార్క్లో అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు.
ఉదయం 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పెరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియా గాంధీ ప్రసంగం, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది.
జూన్ 2వ తేదీ సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30కు సీఎం ట్యాంక్ బండ్కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.
స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్బండ్పై ఇటు చివర నుంచి అటు చివరి వారకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 5 వేల మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్వాక్జరుగుతున్నంత సేపు జయ జయహే తెలంగాణ ఫుల్వర్షన్ (13.30 నిమిషాల) గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి శ్రీ అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి సన్మానం చేస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు.