హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఎస్సీల వర్గీకరణ కోసం అనేక దశాబ్దాలుగా పోరాడుతున్నామని, అయినా కేంద్రంలోని ప్రభుత్వాలు స్పందించడం లేదని మాదిగ కులాల నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇకనైనా ఎస్సీల వర్గీకరణ చేపట్టాలని లేదా ప్రధాని మోదీ మెడలు వంచైనా సాధించుకుంటామని హెచ్చరించారు. ‘ప్రాణాలైనా అర్పిస్తాం.. ఏబీసీడీ వర్గీకరణ సాధిస్తాం’ అన్న నినాదంతో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్మంతర్వద్ద సోమవారం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మార్పీఎస్ నేతలు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఎస్సీల పట్ల వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ నేతలను రాష్ట్రంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. దీక్షలో ఎంపీ పసునూరి దయాకర్, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర్టకు చెందిన నేతలు పాల్గొన్నారు.