KTR | కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు, రైతు బీమా, 24 గంటలు కరెంట్ టైమ్ వస్తుండే అని కేటీఆర్ తెలిపారు. అదే రేవంత్ రెడ్డి వచ్చాక రైతుబంధు ఎగ్గొట్టిండని.. పింఛన్ పెంచలేదని.. బోనస్ బోగస్ అయ్యిందని తెలిపారు. ఆడబిడ్డలకు మహాలక్ష్మి స్కీం రాలేదని అన్నారు. . గిరిజన, దళిత, పేద రైతులకు మద్దతుగా మహబూబాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నాడు నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మహారాష్ట్రకు పోయి కూడా ఆడబిడ్డలను మోసం చేసే ప్రయత్నం చేస్తే అక్కడి ఆడబిడ్డలు బుద్ధి చెప్పారని తెలిపారు. వీడు పచ్చి లంగా, తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేశాడని చైతన్యం ప్రదర్శించి తన్ని తన్ని తరిమేశారని పేర్కొన్నారు.
నేను ఇక్కడ వస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతమని అంటున్నారని కేటీఆర్ తెలిపారు. నేను డీజీపీ, ఎస్సీ గారిని అడుగుతున్నా.. రాళ్లతో కొడతామంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసులు మా మీద మాత్రమే పెడుతారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కేసులు ఉండవా? అని నిలదీశారు. మా గిరిజన రైతుల కోసం కదులుతూ మానుకోటలో ధర్నా చేస్తామంటే…లగచర్లలో జరిగిన సంఘటనకు మానుకోటలో ధర్నా ఎందుకు అని డీజీపీ ప్రశ్నించారని తెలిపారు. కొడంగల్ రైతుల కోసం ఒక్క మానుకోటలోనే కాదు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ దళితులు, బీసీలు, గిరిజనులు ఉన్నారో అక్కడ ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. సన్నకారు, బక్క చిక్కిన రైతులతో పెట్టుకున్న ఈ రేవంత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పే సమయం వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. .రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించే దాకా వదిలిపెట్టమని చెప్పారు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే, పెట్రోల్ పోస్తామంటే భయపడమని కేటీఆర్ అన్నారు. మేము కేసీఆర్ తయారు చేసిన దళం.. భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మానుకోట రాళ్ల మహత్మ్యం ఏందో తెలంగాణను అడ్డుకున్న వాళ్లందరికీ తెలుసని అన్నారు. మానుకోటలో 14 ఏళ్ల క్రితమే నిప్పు పుట్టి ఆ తర్వాత తెలంగాణ వచ్చిందని అన్నారు. ఇవాళ మీరు పర్మిషన్ ఇవ్వకుంటే హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నామని అన్నారు. ఈ మహా ధర్నాకు వెయ్యి మంది అనుకుంటే 25 వేల మంది వచ్చారని.. అంటే ప్రభుత్వం మీద ఎంత కోపం, వ్యతిరేకత ఉందో ఈ మానుకోట మహాధర్నా చూస్తే అర్థమవుతోందని అన్నారు.