వనపర్తి, మే 21 (నమస్తే తెలంగాణ): మత్స్య సంపదలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎగుమతులు చేసే దశకు సంపద పెరిగిపోయిందని తెలిపారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో మత్స్య కళాశాల బాలికల వసతి గృహాన్ని, చేపల చెరువు, సీసీ రోడ్డును వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి మంత్రి తలసాని ప్రారంభించారు. అనంతరం తలసాని మాట్లాడు తూ.. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారులకు గుర్తింపు లభించలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ మత్స్య సంపదను పెంచేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది మత్స్య సంపదతో లబ్ధిపొందుతున్నారని తెలిపారు.
చేపల పెంపకం లాభదాయకం: నిరంజన్రెడ్డి
చేపల పెంపకంతో వరిని మించి ఆదాయం వస్తుందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. పెబ్బేరు మత్స్య కళాశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. దీన్ని పీజీ కళాశాలగా అప్గ్రేడ్ చేసి పరిశోధన ఉండేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కళాశాలలోని మొదటి బ్యాచ్లో 12 మంది విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వచ్చాయన్నారు. అనంతరం చేపల కట్లెట్ బ్రోచర్లను మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు.