Telangana | జనగామ రూరల్, ఏప్రిల్ 12: ఇటీవల ప్రభుత్వం ముగ్గురు ట్రేడర్లపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ వ్యాపారులు శుక్రవారం జనగామ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు నిలిపేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేస్తున్నదని, మార్కెట్ నిబంధనల ప్రకారం ఉన్న ధరలకే తాము రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రైతులు పచ్చిగా ఉన్న ధాన్యాన్ని మార్కెట్కు తీసుకురావడం, హమాలీల సమస్య ఉండటంతో మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లను బంద్ చేసినట్టు చెప్పారు. ఫలితంగా రైతులు తీసుకొచ్చిన ధాన్యం రాశులతో మార్కెట్ నిండిపోయింది.
ధాన్యం అమ్ముకునేందుకు రైతులు నాలుగైదు రోజులుగా మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నారు. వ్యాపారులపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేయడం వల్లే మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లను బంద్ చేసినట్టు జనగామ ట్రేడర్స్ అధ్యక్షుడు నాగబండి రవీందర్ పేర్కొన్నారు. మార్కెట్లో ఈ-నామ్ ప్రకారమే ధర నిర్ణయిస్తారని, వాటి ప్రకారమే రైతు అమ్ముకుంటే తాము కొనుగోలు చేస్తామని ఆయన వివరించారు. వ్యాపారులు రేటు నిర్ణయించి తక్కువకు కొనుగోలు చేస్తున్నారనేది తప్పుడు ప్రచారమని, తమపై కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.