KTR | మూసీ నది ప్రక్షాళనకు తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే ప్రభుత్వం మూసీ ప్రాజెక్ట్ పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నందున దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇవాళ అసెంబ్లీలో మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక అంశాలపై కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. ముఖ్యంగా డీపీఆర్ (DPR) తయారీ, ఇళ్ల కూల్చివేతలు, భూసేకరణ, ప్రాజెక్ట్ వ్యయం పెంపు, అలాగే ప్రభుత్వం చేస్తున్న విభిన్న ప్రకటనలలో ఉన్న విరుద్ధతలను ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, బండారు లక్ష్మారెడ్డి కలిసి మూసీ ప్రాజెక్టుపై అనేక సందేహాలను వ్యక్తం చేశారు.
మొత్తం 16 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్షన్నర కోట్లకు పెంచడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఒకవైపు లక్షన్నర కోట్లు అంటుండగా, సభలో మాత్రం నాలుగు, ఐదు వేల కోట్లు అని చెప్పడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు.
ఈ ప్రాజెక్టును ఎన్ని దశల్లో అమలు చేస్తారు, ఎంత భూసేకరణ జరుగుతుంది, ఎన్ని ఇళ్లు కూల్చివేస్తారు అనే విషయాలను ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గెజిట్ ప్రకారం 10,000 పైగా ఇళ్లు కూల్చివేతకు గురవుతాయని, 3,260 ఎకరాల భూమి సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. బఫర్ జోన్ను విస్తరించామని స్థానిక ఆర్డీవో చెబుతున్నారని, అసలు బఫర్ జోన్ ఎంత వరకు పెంచారో, దానికి ప్రమాణాలు ఏమిటో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్ట్ పేరిట ప్రజల ఆస్తులు, ఇళ్లు, జీవనోపాధిపై దెబ్బతీసే చర్యలను బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని, పారదర్శకత లేకుండా తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద డీపీఆర్ ఉందా లేదా అన్న విషయానికే స్పష్టమైన సమాధానం లేదని విమర్శించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సైతం డీపీఆర్ లేదని చెబుతున్నారని తెలిపారు. ఎన్ని ఇళ్లు కూల్చివేస్తున్నారు అనే విషయానికీ ప్రభుత్వం సరైన వివరాలు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఫైవ్ స్టార్ హోటళ్లలో ప్రజెంటేషన్లు చేయకుండా, బాధితులతో ప్రజల మధ్యే ప్రజెంటేషన్ ఇవ్వాలని తాము డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ కారణంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు బీఆర్ఎస్ హాజరుకాలేదని స్పష్టం చేశారు.
మూసీ నదిని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్ పార్టీయేనని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు అదే పార్టీ ప్రజల పేరుతో భారీ ప్రాజెక్ట్ పేరుతో అవినీతి చేయాలని చూస్తోందని అన్నారు. ప్రభుత్వం వద్ద డీపీఆర్ ఉంటే వెంటనే సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ నగర్కు నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ అస్పష్టతకు నిదర్శనమని విమర్శించారు. మొదట 1,400 ఇళ్లు కూల్చివేస్తామని చెప్పి, ప్రస్తుతం 10,000 ఇళ్లకు పైగా నోటీసులు ఇవ్వడం ఎలా జరిగిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లాలో సొంత జిల్లాలోనే ఇళ్లు కూల్చివేస్తున్నా ఉప ముఖ్యమంత్రికి కనీస సమాచారం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవని, సరైన ప్రణాళిక లేదని, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) లోన్ కూడా లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్ తయారీని ‘మెయిన్ హార్ట్’ అనే కంపెనీకి అప్పగించారని, ఈ కంపెనీని సింగపూర్, పాకిస్తాన్, భారతదేశంలోని అనేక సంస్థలు బ్యాన్ చేశాయని తెలిపారు. గతంలో ఇదే అసెంబ్లీలో డీపీఆర్ తయారీకి కనీసం 18 నెలలు పడుతుందని చెప్పి, ఇప్పుడు కేవలం రెండు నెలల్లో డీపీఆర్ సిద్ధమైందని చెబుతుండటం అనుమానాస్పదమని అన్నారు. రెండు నెలల్లో అద్భుతంగా డీపీఆర్ తయారు చేసి ఉంటే, దాన్ని ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
మూసీ ప్రాజెక్టుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఇవ్వడానికి అంగీకరించిందని మంత్రి శ్రీధర్ బాబు సభలో చెప్పారని, కానీ బ్యాంక్ అధికారులను సంప్రదించగా జనవరి 23 నాటికి ఎలాంటి డీపీఆర్ తమకు అందలేదని, కాబట్టి రుణంపై ఎలాంటి అంగీకారం లేదని స్పష్టం చేశారని తెలిపారు. మార్చి 11న కూడా అదే విషయాన్ని ఏడీబీ మరోసారి స్పష్టం చేసిందని అన్నారు. ప్రభుత్వం తన సమాచారాన్ని సరిదిద్దుకోవాలి లేదా కావాలనే ప్రజలను, సభను తప్పుదోవ పట్టిస్తున్నదా అనే అనుమానం కలుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.