ములుగు : రామప్ప ఆలయానికి పాలంపేట డెవలప్మెంట్ అథారిటీలో భాగంగా స్థానికతకు ప్రాముఖ్యతనునిస్తూ సంస్కృతిని పరిరక్షించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. ములుగు కలెక్టరేట్లో పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ, టూరిజంశాఖ సంయుక్తంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ యునెస్కో నిబంధనలతో పాటు స్థానిక నిబంధనలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
యునెస్కో అన్ని దేశాలను దృష్టిలో పెట్టుకొని తమ నిబంధనలను స్థానికంగా అమలు చేస్తుందన్నారు. స్థానిక ప్రాంత సంస్కృతి సంప్రదాయాలు, కట్టుబొట్టు, గుడులను దృష్టిలో పెట్టుకొని గ్రామాల అభివృద్ధితో పాటు స్థానిక నిబంధనలను పాటించాలన్నారు. బయోడైవర్సిటీ రిజిస్టర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. పాలంపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతూ వాలంటరీ ఏర్పాటు చేసుకొని పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ కమిటీ ఎంతో శ్రద్ధ పెట్టి పని చేయాలని సూచించారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం గొప్ప విషయమని, దాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రొఫెసర్ పాండురంగారావు పాపారావు టూరిజం చేస్తున్న కృషిని కొనియాడారు.
పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ రామప్ప అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకుల సందర్శన కోసం వరాలగుట్ట, వాన గుట్ట, స్థానిక గుడులు పోచమ్మ, కట్ట మైసమ్మ, బొడ్రాయి స్థానిక సాంస్కృతి సాంప్రదాయాలను సందర్శించే విధంగా చూడాలన్నారు. ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడుతూ రామప్ప దేవాలయానికి రామప్ప దేవాలయ అభివృద్ధికి ప్రసాద్ స్కీమ్ ద్వారా నిధులు వస్తాయని అన్నారు. పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ కమిటీ అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించి హెరిటేజ్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న కృషిని ఆయన వివరించారు.