కాకతీయ కాలువకు 4వేల క్యూసెక్కులు విడుదల
సీఎం కేసీఆర్కు మంత్రులు కొప్పుల, వేముల, గంగుల కృతజ్ఞతలు
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి కాకతీయకాలువకు అధికారులు మంగళవారం ఉదయం 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బుధవారం సాయంత్రానికి దీనిని 6వేల క్యూసెక్కులకు పెంచనున్నారు. ప్రాజెక్టు కింద వానకాలం సాగుకోసం నీటిని విడుదల చేయాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్తోపాటు, ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన సీఎం నీటివిడుదలపై ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ప్రాజెక్టు నుంచి కాకతీయకాలువకు నీటిని వదిలారు. దీంతో నిజామాబాద్ జిల్లాలోని కొంతభాగం, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, చొప్పదండి, ధర్మపురి, మంథని తదితర నియోజకవర్గాల్లో సాగు పనులు మరింత ముమ్మరం కానున్నాయి. రైతుల కోరికను మన్నించి సకాలంలో నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు.