హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం విచిత్ర వాదన చేస్తున్నది. ఒక వైపు ప్రాజెక్టులను అప్పగించలేదంటూనే, మరోవైపు ప్రాజెక్టుల నిర్వహణ మొత్తం ఇకపై బోర్డు పర్యవేక్షణలోనే కొనసాగుతుందని చెప్తున్నది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం జలసౌధలో మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టుల ఔట్లెట్లను అప్పగించేందుకు అంగీకరించినట్టు స్పష్టంగా చెప్పారు. జనవరి 17న ఇరు రాష్ర్టాలతో కేంద్ర జల్శక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులతోపాటు మొత్తం 15 ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. అందుకు ఏపీతోపాటు తెలంగాణ ప్రభుత్వం సైతం అంగీకారం తెలిపింది. తదుపరి చర్యల కోసం గురువారం నిర్వహించిన సమావేశంలోనూ తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించిందని మురళీధర్ వెల్లడించారు. తాజాగా ప్రాజెక్టులను అప్పగించలేదంటూ మాట మార్చారు.
మీడియాలో వచ్చిన విధంగా ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదని, అయినప్పటికీ 17నాటి సమావేశం మినిట్స్లో తప్పుగా రికార్డు చేశారని మురళీధర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి లేఖ రాశామని, బోర్డు సమావేశంలో ఇదే విషయాన్ని తెలిపామని వెల్లడించారు. ట్రిబ్యునల్ అవార్డు ఖరారయ్యేవరకూ ఇరు రాష్ర్టాలు 50:50 నిష్పత్తిలో జలాలను వినియోగించుకోవడం తదితర అంశాలపై కేంద్ర జల్శక్తిశాఖకు లేఖ రాసి కేఆర్ఎంబీకి అందించామని వివరించారు. అయితే విద్యుత్తు ప్రాజెక్టులు మినహా మిగతా 10 ప్రాజెక్టుల ఔట్లెట్ల నిర్వహణ బాధ్యతను పూర్తిగా బోర్డే చూసుకుంటుందని వెల్లడించారు.
గతంలో మాదిరిగా త్రీమెన్ కమిటీనే నీటి వాటాల నిర్ధారణ, విడుదలను పర్యవేక్షిస్తుందని, అందుకు ఇరు రాష్ర్టాల నుంచి అధికారులను కేటాయించాల్సి ఉంటుందని మురళీధర్ తెలిపారు. జీతభత్యాలు తదితర సాంకేతిక అంశాలు ఇంకా ఫైనల్ కావాల్సి ఉన్నదని, ఉద్యోగులు సైతం బోర్డు పరిధిలోనే కొనసాగుతారని వెల్లడించారు. దీంతో ప్రాజెక్టులను బోర్డు చేతిలో పెట్టినట్టుగా పరోక్షంగా అంగీకరించారు. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ, ఏపీ, తెలంగాణ ఈఎన్సీలతో కూడిన త్రీమెన్ కమిటీనే తాగు, సాగునీటి అవసరాలకు ఇరు రాష్ర్టాల నుంచి ఇండెంట్లను తీసుకుని సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో 66:34 నిష్పత్తిలో కేటాయిస్తున్నది. త్రీమెన్ కమిటీ సిఫారసుల మేరకు నీటి విడుదలకు బోర్డు ఉత్తర్వులను జారీ చేస్తున్నది. శ్రీశైలం రిజర్వాయర్ కంట్రోల్ ఏపీ, నాగార్జునసాగర్ రిజర్వాయర్ కంట్రోల్ తెలంగాణ పరిధిలో ఉన్నది. ఆయా రాష్ర్టాల అధికారులే త్రీమెన్ కమిటీ కేటాయింపుల మేరకు జలాలను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదేవిధానానికి అంగీకరించామని మురళీధర్ చెప్పారు. కానీ, ఇక్కడే అసలు మెలిక ఉన్నది. ప్రస్తుతం సాగర్డ్యామ్ కుడి కాలువను ఏపీ ఆక్రమించింది. కుడి కాలువ ఆ రాష్ట్ర పరిధిలోనే ఉన్నది. డ్యామ్పైన సీఆర్పీఎఫ్ బలగాల భద్రత ఏర్పాటు కావడంతోపాటు, బోర్డు అనుమతిలేనిదే ఎవరినీ అనుమతించవద్దని కేంద్ర జల్శక్తిశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. సూటిగా చెప్పాలంటే సాగర్డ్యామ్ పూర్తిగా కేంద్రం ఆధీనంలోకి వెళ్లిపోయింది. ప్రాజెక్టును తిరిగి స్వాధీనం చేసుకోవాల్సింది పోయి బోర్డు ఆధీనంలోనే ప్రాజెక్టు నిర్వహణకు తెలంగాణ అంగీకరించింది. ఇదే విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా ప్రాజెక్టులను అప్పగించలేదంటూనే, మళ్లీ బోర్డే నిర్వహణ చూస్తదని తెలిపడం గమనార్హం. ఇప్పటివరకు రిజర్వాయర్లు, ఔట్లెట్లపై ఉన్న అధికారులు ఆయా రాష్ర్టాల అజమాయిషీలోనే ఉండగా, ఇకపై వారిని బోర్డుకు అప్పగించాల్సి ఉంటుంది. అంటే బోర్డుకు ఔట్లెట్లను పూర్తిగా అప్పగించినట్టే.
త్రీమెన్ కమిటీనే గతంలోమాదిరిగా నీటి వాటాలను పంపిణీ చేస్తుందని మురళీధర్ తెలిపారు. కృష్ణా జలాలకు సంబంధించి ఇరు రాష్ర్టాల మధ్య ఎలాంటి ట్రిబ్యునల్ కేటాయింపులు లేకపోవడంతో అప్పటికీ ఆయా ప్రాజెక్టుల వినియోగ సామర్థ్యం మేరకు 66:34 నిష్ఫత్తిలో వినియోగించుకోవాలని ఏడాది కాలపరిమితితో 2015లో ఏపీ, తెలంగాణ తాత్కాలిక ఒప్పందం చేసుకొన్నాయి. ఆ ఒప్పందాన్నే ఇప్పటివరకు పొడిగించుకుంటూ వస్తున్నాయి. ఇకపై తాత్కాలిక ఒప్పందానికి ఎంతమాత్రం అంగీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం 2021-22 నీటి సంవత్సరంలో తేల్చిచెప్పింది. ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తయ్యేవరకూ కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో వినియోగించుకుంటామని నొక్కిచెప్పింది. ఈ అంశాన్ని అపెక్స్కౌన్సిల్కు రెఫర్ చేయాలని కూడా కోరింది. ఆ వాదనకు విరుద్ధంగా గతంలో మాదిరిగానే నీటి కోటాలను వినియోగించుకునేందుకు అంగీకరించామని ఈఎన్సీ మురళీధర్ వెల్లడించడం గమనార్హం. 50:50 నిష్పత్తిలో జలాల వినియోగించుకుంటామన్న తెలంగాణ డిమాండ్కు పాతర వేశారు. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దానిపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలపడం కొసమెరుపు.