హైదరాబాద్/ నెట్వర్క్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగుతుండగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కడెం, ఎస్సారెస్పీ నుంచి వరద తగ్గినా, స్థానికంగా కురిసిన రికార్డుస్థాయి వర్షాలతో గోదావరికి వరద పోటెత్తున్నది. ఎల్లంపల్లిలో 8 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తుండగా, ప్రాణహిత వరద కూడా తోడై గోదావరి ఉధృతి పెరుగుతున్నది. దిగువకు వెళ్లిన కొద్దీ ఇతర వాగులు కలుస్తుండటంతోపాటు భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రంగా ప్రవహిస్తున్నది. భద్రాచలం వద్ద నీటి మట్టం శుక్రవారం రాత్రి 7 గంటలకు 52 అడుగులకు, రాత్రి 9కి 53, రాత్రి 10.30 గంటలకు 53.20 అడుగులకు చేరుకున్నది. దీంతో భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. శనివారం ఉదయానికి నీటిమట్టం 56 అడుగులు దాటొచ్చని అంచనా వేస్తున్నారు. గోదావరి ప్రవాహం పెరుగుతుండటంతో భద్రాచలం-వెంకటాపురం, భద్రాచలం-ఛత్తీస్గఢ్ ప్రాం తాలకు వెళ్లే రహదారులతోపాటు బూర్గంపహాడ్ మండలంలోని సారపాక-నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, ఇరవెండి-అశ్వాపురం రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర సేవల కోసం ప్రభుత్వం భద్రాచలంలోని బీపీఎల్ స్కూల్ ప్రాంగణంలో హెలికాప్టర్ను సిద్ధంగా ఉంచింది. మంత్రి పువ్వాడ అజయ్ వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు. విప్ రేగా కాంతారావు అశ్వాపురం, బూర్గంపహాడ్ మండలాల్లో పర్యటించారు. ఇప్పటికే అధికారులు 430 గ్రామాలకు చెందిన ప్రజలను 40 పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. శ్రీరాంసాగర్తోపాటు, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి
కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. ఎగువన ఆల్మట్టి, తుంగభద్ర, నారాయణపూర్ పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరువవుతు న్నాయి. జూరాలకు శుక్రవారం ఉదయం 35 వేల క్యూసెక్కుల వరద రాగా సాయంత్రం 4 గంటలకు 37,951 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో జూరాల వద్ద 22 గేట్లు ఎత్తి 1,22,262 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. శుక్రవారం సాయంత్రానికి 66 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, నాగార్జునసాగర్కు మాత్రం స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నది.
వరదలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా
నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వరుసగా రెండోరోజు కూడా క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. పలు ముంపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగానికి సూచనలిచ్చారు. వరద తగ్గాక అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.