Andhrajyothy | గద్వాల/అలంపూర్, మార్చి 6: పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో విద్యనందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు స్థాపించారు. విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు నాణ్యమైన భోజనం అందిస్తుంటే కొన్ని పత్రికలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. గోరంత సమస్యను కొండంత చేసి చూపిస్తూ లేని సమస్యలను ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్నాయి. విద్యార్థినులు, తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తున్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రామంలో ఉన్న జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థినులకు అవసరమైన అన్ని వసతులు ఉన్నప్పటికీ.. వసతులు లేవని ఒంటికి, రెంటికి విద్యార్థినులు నానా అవస్థలు పడుతున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక అవాస్తవాలను ప్రచారం చేస్తున్నది. గురుకులంలో బోరుకు మరమ్మతులు చేసేందుకు ఒక రోజు సమయం పట్టింది. ఆ సమయంలో విద్యార్థినులకు నీటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలనే ఆలోచనతో ప్రిన్సిపాల్ దేవానందం సర్పంచ్తో మాట్లాడి ట్యాంకర్ ఏర్పాటు చేయించారు.
విద్యార్థులు భోజనం చేసిన తర్వాత నీటి ట్యాంకర్ వద్దకు వెళ్లి తిన్న ప్లేట్లు కడుగుతుంటే.. దానిని చూసిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక విద్యార్థినులు వారం రోజులుగా ఒంటికి, రెంటికి నీటి వసతి లేక అవస్థలు పడుతున్నారని కట్టుకథ అల్లి వార్త ప్రచురించింది. ఈ గురుకుల పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి వరకు 471 మంది, కళాశాలలో 243 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థినుల కోసం 50 తరగతి గదులు, 80 టాయిలెట్లు ఉన్నాయి. 32 మంది టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. సింగిల్ఫేజ్, త్రీ ఫేజ్తో నడిచే మోటర్లు, స్వచ్ఛమైన తాగునీరందించేందుకు ఆర్వోప్లాంట్ ఉన్నాయి.
కాగా, పాఠశాలకు త్రీఫేజ్ విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ప్రైవేట్గా విద్యుత్తు కనెక్షన్ పొందారు. అయితే, పాఠశాల ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్తు అధికారులు ఇంటీరియర్ పనులు చేయకపోవడంతో కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం జరిగింది. అంతేకాకుండా నాలుగు రోజుల కిందట మూడు గ్రామాలకు విద్యుత్తు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు రావడంతో కరెంట్కు అంతరాయం ఏర్పడింది. దీనిని సరిచేసి పాఠశాలకు త్రీఫేజ్ విద్యుత్తు సౌకర్యం కల్పించినట్టు అలంపూర్ విద్యుత్తు శాఖ ఏడీ సయ్యద్ మక్బూల్ తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థినులను సొంత బిడ్డలుగా చూసుకుంటూ అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే.. ఇలా ఇబ్బందులకు గురిచేసేలా కథనం రాయడమేంటని ప్రశ్నిస్తున్నారు.