హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడు కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఆనాడు సబ్బండ వర్గాలను ఏకం చేసారు. అదే నినాదాన్ని నేడు ముఖ్యమంత్రి హోదాలో ప్రపంచమే అబ్బురపడేలా సాగునీటి ప్రాజెక్టులు కట్టి, మన నీళ్లు మనకు తెచ్చారు. నేడు ఉద్యోగాల ప్రకటనతో నాటి నినాదాన్ని నిజం చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మన నిధులు మనకే అని ఆర్థిక క్రమశిక్షణతో ఖర్చు చేసుకోవడం వల్ల నేడు తెలంగాణ జీఎస్డీపీ వృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగిందన్నారు.
నియామకాల విషయంలో కూడా ఉద్యమ ట్యాగ్ లైన్ స్ఫూర్తిని కొనసాగిస్తూ..ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 11వేల 103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించడం,80వేల 39 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి నేడు అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు.