కరీంనగర్, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సహజంగా ప్రాజెక్టులో నీళ్లుంటేనే కాలువ దిగువకు పారుతుంది. కానీ, ఆ కాలువలో నీళ్లు ఎదురెక్కి జలాశయాన్ని నింపుతున్నాయి. అంతేకాదు, రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని పోవాల్సిన కాలువే.. నేడు 122 కిలోమీటర్ల పొడవునా రిజర్వాయర్లుగా మారి కళ్లముందు సాక్షాత్కరించింది. దిగువకు నీళ్లు ఇవ్వాల్సిన కాలువే.. ఎగువన ఉన్న ప్రాజెక్టుకు నీళ్లు మోసుకెళ్తూ భరోసాను ఇస్తున్నది. ఈ మాటలు వినడానికి ఆశ్చర్యంగా కనిపిస్తున్నా.. అక్షర సత్యం. సీఎం కేసీఆర్ స్వయంగా ప్లానిం గ్ చేసిన శ్రీరాంసాగర్ పునర్జీవ పథకంతో 122 కిలోమీటర్ల మేర కాళేశ్వరం జలాలతో నిండుకుండలా మారిన వరదకాలువే దీనికి సజీవ సాక్ష్యం. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో వరదకాలువ తన స్వరూపాన్ని మార్చుకొన్నది. కాలం ఉన్నా లేకున్నా.. వరద వచ్చినా రాకున్నా.. కాళేశ్వరం జలాలతో భవిష్యత్తు అంతా కళకళ లాడడమేకాదు.. లక్షల ఎకరాల పంట చేలను పునరుజ్జీవింప చేయనున్నది.
19 ఏండ్లు కొనసాగిన వరద కాలువ పనులు
1963 జూలై 26న నాటి ప్రధాని నెహ్రూ పోచంపాడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా, 112 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 1970 జూలై 24న అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోచంపాడును శ్రీరాంసాగర్ ప్రాజెక్టుగా పేరు మార్చా రు. శ్రీరాంసాగర్ స్టేజీ-1 కింద 9,68,640 ఎకరాలు, స్టేజీ- 2 కింద 3,97,949 ఎకరా లు మొత్తంగా 13,55,589 ఎకరాలకు సాగునీరు అందించాలని ఆనాటి పాలకులు ప్రణాళిక రూపొందించారు. అప్పట్లో ప్రాజెక్టుకు భారీగా వరదొలిచ్చినప్పడు నీరంతా సముద్రం పాలయ్యేది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడు ఆ నీరును దిగువకు ఇవ్వాలన్న లక్ష్యంతో 1991లో ఆనాటి ప్రధాని పీవీ నర్సింహరావు వరదకాలువకు శంకుస్థాపన చేశారు. ఈ కాలువ ద్వారా దిగువకు 20 టీంఎసీల నీటిని తరలించి.. 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆనాడు నిర్ణయించారు. కానీ, ఆరంభం నుం చి చివరి వరకు వరదకాలువ పనుల విషయంలో నాటి పాలకులు నిర్లక్ష్యం చూపారు.
ఫలితంగా 122 కిలోమీటర్ల పొడవు కాలువ తవ్వడానికి 19 ఏండ్లు పట్టింది. 1991లో పనులు ప్రారంభం కాగా, 2010 నుంచి కాలువ అందుబాటులోకి వచ్చింది. కాలువ నుంచి వచ్చే నీటిని ఒడిసి పట్టుకొనేందుకు అనుగుణంగా దిగువ డ్యాంలు కట్టి వాటిలో నీళ్లు స్టోరేజీ చేసుకోవాలన్న ఆలోచన గత పాలకులకు లేకపోయింది. ఈ విషయంలో విమర్శలు రావడంతో 2005-06లో మానేరుపై శ్రీరాజరాజేశ్వర జలాశయాన్ని ప్రారంభించిన ఆనాటి ప్రభుత్వాలు.. నిబంధనల ప్రకారం 2009 నాటికి పూర్తిచేయాలి. కానీ, 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయింది. తెలంగాణ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా నిధులు కేటాయించి.. రెండేళ్లలోనే శ్రీ రాజరాజేశ్వర జలాశయాన్ని పూర్తి చేసింది. దానికి ముందు వరదకాలువ ద్వారా నీరు కేవలం లోయర్మానేరు డ్యాంకు మాత్రమే వచ్చేవి. నిజానికి వరద కాలువ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రెండు మూడుసార్లు మాత్రమే వినియోగం పూర్తిగా జరిగింది. అనంతరం ఎస్సారెస్పీకి ఇన్ఫ్లో తగ్గడం ప్రారంభమైంది. దీంతో వరదకాలు వెలవెలబోయింది. పక్కనే కాలువ ఉన్నా చుక్కనీరు లేక కాలువ పక్కన భూము లు బీడుబారాయి. వరదకాలువలో నీళ్లు లేక పిల్లలు తమ ఆటల కోసం కాలువను వినియోగించుకున్న సందర్భాలు అనేకం.
దారిచూపిన దార్శనికుడు కేసీఆర్
వరదకాలువ ద్వారా ప్రయోజనం లేదం టూ యావత్తు రైతాంగంలో నిరాశ నిండుకొన్నది. ఈ తరుణంలో స్వరాష్ట్రం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రాజెక్టుల రీడిజైనింగ్కు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే కాళేశ్వరం జలాలను ఎత్తి వరద కాలువద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నింపేందుకు స్వయంగా ప్రణాళిక రచించారు. ఆ మేరకు శ్రీరాంసాగర్ పునర్జీవ పథకానికి శ్రీకారం చుట్టారు. 1,999.56 కోట్లతో చేపట్టిన ఈ పునర్జీవ పథకానికి 2017 ఆగస్టు 10న ముప్కాల్ వద్ద ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కాళేశ్వర జలాలను ఎస్సారెస్పీ పాదాల వద్దకు తెచ్చి.. లక్షలాది ఎకరాలకు అష్యూర్డ్ వాటర్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి సభలో చెపితే.. ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేలాయి. ఇది సాధ్యమయ్యేది కాదంటూ విమర్శలు చేశాయి. కానీ, కార్యసాధకుడైన కేసీఆర్ మాత్రం వాటిని లెక్క చేయకుండా నిర్దేశిత లక్ష్యం వరకు పనులు పరుగులు పెట్టించి, తాను చెప్పింది చెప్పినట్టుగా చేసి చూపించడమేకాదు ప్రజల కండ్లముందు ఆవిష్కరింపజేశారు. పునర్జీవ పథకంలో భాగంగా కాళేశ్వరం నీటిని గాయత్రి పంపుహౌస్ నుంచి ఎత్తిపోసే నీరు వరదకాలువ 99.02 కిలోమీటర్ వద్ద కలుస్తాయి. ఇక్కడి నుంచి శ్రీరాంసాగర్ప్రాజెక్టుకు అంటే ఎగువకు వెళ్లేందుకు.. వరద కాలువ 102 కిలోమీటర్ వద్ద హెడ్ రెగ్యులరేటరీ గేట్లు ఏర్పాటు చేశారు. వరదకాలువ 102 కిలోమీటర్ నుంచి ఎగువన 73 కిలోమీటర్వద్ద ఏర్పాటు చేసిన రాంపూర్ పంపుహౌస్ గేటు వరకు అర టీఎంసీ నీరు వరదకాలువలో నిల్వ ఉంటుంది.
అక్కడి నుంచి 34 కిలోమీటర్ వద్ద ఏర్పాటుచేసిన రాజేశ్వర్రావు పేట పంపుహౌస్ వరకు మరో అర టీఎంసీ, తిరిగి అక్కడి నుంచి 0.10 కిలోమీటర్ ముప్కాల్ వద్ద ఏర్పాటు చేసిన పంపుహౌస్ వరకు ఇంకో అరటీఎంసీ నీరు నిల్వ ఉంది. వీటితోపాటు 102 కిలోమీటర్ నుంచి దిగువకు అంటే శ్రీరాజరాజేశ్వరజలాశయం (మధ్యమానేరు)లో కలిసే 122 కిలోమీటర్ వరకు మరో అర టీఎంసీ నీరు నిల్వ ఉంటుంది. మొత్తంగా వదరకాలువ నునిశితంగా పరిశీలించి చూస్తే.. ప్రస్తుతం నాలుగు రిజర్వాయర్లుగా మారి.. దాదాపు రెండు టీఎంసీల నీటిని తన ఒడిలో నింపుకొని ఆ పై నీటిని శ్రీరాంసాగర్ప్రాజెక్టులోకి పంపిస్తున్నది. కేవలం వరదకు మాత్రమే వినియోగించేలా నాటిపాలకులు ప్లాన్ చేస్తే.. అదే వరద కాలువను కాళేశ్వరం జలాలతో జల జీవధారగా మార్చి ప్రజల ముందు ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వరదకాలువను రిజర్వాయర్లుగా మార్చడం వల్ల మూడు జిల్లాలోని అనేక మండలాల్లో భూగర్భజలాలు పుష్కలంగా పెరగడమేకాదు.. దాదాపు 33 వేల విద్యుత్మోటర్లు నిరంతరం నడువనున్నాయి. మొత్తంగా చూస్తే.. పునర్జీవ పథకంతో కాళేశ్వరం జలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరడం సాగునీటిరంగంలో ఒక నవ చరిత్రకు నాంది అంటూ సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు.