మల్లారెడ్డిపేట బడికి వాటర్ కన్సర్వేషన్ అవార్డు
నీటి పొదుపు, సంరక్షణ చర్యలకు గుర్తింపు
గంభీరావుపేట, ఫిబ్రవరి 26: స్వచ్ఛతలో రాష్ట్రస్థాయిలో మెరిసిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట జెడ్పీ పాఠశాల తాజాగా వాటర్ కన్సర్వేషన్ అవార్డు-2021కి ఎంపికయ్యింది. పాఠశాలలో నీటి వృథాను అరికట్టి, పొదుపు దిశగా చేపట్టిన చర్యలకు ఈ అవార్డు దక్కింది. ఉపాధ్యాయుల సాయంతో విద్యార్థులు పాఠశాల ఆవరణలో ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఇంకుడు గుంతలను నిర్మించారు. వర్షాకాలంలో భవనాల పైనుంచి వచ్చే వాననీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించారు. విద్యార్థులు ఆహారం తీసుకునే ముందు తర్వాత చేతులు, ప్లేట్లు కడిగిన నీరు, వంటపాత్రలను శుభ్రం చేసిన నీటిని పైపుల్లోకి మళ్లించి మొక్కలకు తరలించారు. ఇలా ప్రతి నీటి బొట్టును పొదుపు చేస్తున్న వీరి కృషికి గుర్తింపు దక్కింది. 2021 సంవత్సరంలో వాటర్ కన్సర్వేషన్ క్యాటగిరిలో మల్లారెడ్డిపేట జెడ్పీ ఉన్నత పాఠశాల అవార్డుకు ఎంపికవ్వడం పట్ల మండల విద్యాధికారి బన్నాజి హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం హైదరాబాద్లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేందర్ అవార్డు అందుకోనున్నారు.