కరీంనగర్ తెలంగాణచౌక్, మార్చి 17 : ఆర్టీసీ సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి బస్సుల్లో ప్రయాణించే వారికి అందించాల్సిన జీవ (500ఎంల్) వాటర్ బాటిళ్లను బంద్ పెట్టారు. నాలుగు రోజులుగా సరఫరా నిలిపివేశారు. కానీ, వాటర్ బాటిల్కు మాత్రం టికెట్ ధరలో రూ.పది చొప్పున చార్జీ వడ్డించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ బాటిల్ ఎందుకు ఇవ్వడంలేదని డ్రైవర్లు, కండక్టర్లను ప్రశ్నిస్తున్నారు. తమకు తెలియదని డీఎం స్థాయి అధికారుల నంబర్లు ఇస్తూ దాటవేస్తుండపై ప్రయాణికులు మండిపడుతున్నారు.
వాస్తవానికి జీవ వాటర్ బాటిల్స్ హైదరాబార్ నుంచి కరీంనగర్ వర్క్షాపునకు.. అక్కడి నుంచి వివిధ డిపోలకు సరఫరా చేస్తారు. ఆయా డిపోల నుంచి సూపర్ లగ్జరీ, డీలక్స్, రాజధాని, లహరి బస్సుల సిబ్బంది వాటిని ప్రయాణికులు టికెట్ తీసుకున్నాక అందిస్తారు. కానీ, నాలుగు రోజులుగా జీవ వాటర్ బాటిళ్లు ఇవ్వకుండా టికెట్ ధరలో వాటర్ బాటిల్కు ఎలా చార్జి చేస్తారని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఒక్క కరీంనగర్ డిపో పరిధిలోనే రోజుకు రూ.90వేల దోపిడీ జరుగుతున్నదని, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నదని ఆరోపిస్తున్నారు.