అక్కడ వరదరాజస్వామి అపార కరుణ వరదలా పొంగింది. కంచి నుంచి వచ్చిన స్వామి భూనీలా సమేతంగా కొలువుదీరిన పుణ్యస్థలి ఇది. ఒకప్పుడు దట్టమైన అడవిగా ఉన్న ఈ ప్రాంతం వరదరాజపూర్గా మారింది. శతాబ్దాలుగా భక్తుల పాలిట కొంగుబంగారమై విలసిల్లుతున్నది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఈ ఆధ్యాత్మిక కేంద్రం విశేషాలివి..
పచ్చటి పొలాల మధ్య అలరారుతున్న వరదరాజస్వామి ఆలయంలో అణువణువూ ఆధ్యాత్మికత కనిపిస్తుంది. రాతి స్తంభాలు, విశాల మంటపాలతో అద్భుతంగా ఉంటుంది. శ్వేతవర్ణంలోని మూడంతస్తుల రాజగోపురం సనాతన ధర్మానికి ప్రతీకగా దర్శనమిస్తుంది. సుమారు 450 ఏండ్ల కిందట ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతారు. ఒకప్పుడు దట్టమైన అడవిగా ఉన్న ఈ ప్రాంతంలో వరదరాజస్వామి కొలువుదీరడం వెనుక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. పూర్వం శనిగరం గ్రామానికి చెందిన గూడ ఆచార్య పండితుడు తమ ఊళ్లో వరదరాజస్వామి ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడట. కంచి నుంచి భూనీలా సమేత వరదరాజస్వామి విగ్రహాలను తీసుకొస్తుండగా, ఇప్పుడు ఆలయం ఉన్న ప్రాంతానికి వచ్చేసరికి రాత్రయ్యింది. పరివారంతో అక్కడే విశ్రమించాడు పండితుడు. మర్నాడు స్వామివారికి అర్చనలు నిర్వహించి ప్రయాణానికి సిద్ధమవ్వగా విగ్రహం కదల్లేదట. ఎంత ప్రయత్నించినా విగ్రహం కదలకపోగా, స్వామి ఓ వ్యక్తిని పూని తనకు ఇక్కడే ఆలయం నిర్మించాల్సిందిగా ఆదేశించాడట. దీంతో, శనిగరంలో కట్టించదలచిన ఆలయాన్ని ఇక్కడే నిర్మింపజేశాడట గూడ ఆచార్య పండితుడు. అలా వరదరాజస్వామి క్షేత్రం వెలిసింది. ఈ ప్రాంతానికి వరదరాజపూర్ అన్న పేరు స్థిరపడింది.
అబ్బురపరిచే నిర్మాణం
ఆలయం చుట్టూ విశాలమైన ప్రాకారాలు ఉంటాయి. రాతి స్తంభాలపై హైందవ సంస్కృతిని చాటే విధంగా గాంధార శైలిని పోలిన శిల్పాలు అబ్బురపరుస్తాయి. అధ్యయన, హోమ మంటపాలతో ఆలయం ప్రత్యేకంగా కనిపిస్తుంది. కంచి నుంచి వచ్చిన స్వామి కావడంతో ఆలయ నిర్మాణ శైలి కంచి గుడిని పోలి ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. అందుకు తగ్గట్టే ఆలయ మంటపంలో బంగారు బల్లి, వెండి తొండ ఉంటాయి. స్వామి దర్శనం చేసుకున్న భక్తులు తర్వాత వీటిని చూసి దండం పెట్టుకుంటారు. వీటి దర్శనంతో బల్లిపాటు దోషాలు ఉండవని నమ్మకం. గుడి చెంతనే పురాతన కోనేరు కూడా ఉంది. రాజగోపురం వీధి రెండు వందల మీటర్ల పొడవుతో, పచ్చని చెట్లతో ఉంటుంది. వీధికి ఇరువైపులా అర్చకస్వాముల నివాసాలు ఉంటాయి. ఇక్కడి ప్రశాంత వాతావరణం ఆలయానికి వచ్చే భక్తులకు అలౌకిక ఆనందాన్ని కలుగజేస్తుంది.
జ్యేష్ఠమాస బ్రహ్మోత్సవాలు
శతాబ్దాలుగా స్వామివారికి ఉత్సవాలు సంప్రదాయ బద్ధంగా కొనసాగుతున్నాయి. ప్రతి శనివారం విశేష పూజలు జరుగుతాయి. ఏటా జ్యేష్ఠ శుద్ధ అష్టమి మొదలు బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. రథోత్సవం కన్నులపండువగా సాగుతుంది. ఇందులో పాల్గొనేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి సైతం భక్తులు వరదరాజపురం తరలి వస్తారు. స్వామిని దర్శించుకొని కొండంత ఆనందంతో తిరిగి వెళ్తారు. గజేంద్రమోక్షంలో ‘కావవే వరదా..’ అని గజేంద్రుడు వేడుకోగానే సిరికిన్ జెప్పక వచ్చిన స్వామి, తమనూ కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని భక్తుల విశ్వాసం.
వరదను అడ్డుకొని..
ఇక్కడ స్వామి కొలువుదీరడం వెనుక మరో ఆసక్తికర కథనం ప్రచారం ఉంది. ఈ ప్రాంతంలోని వాగు తరచూ పొంగి స్థానికులకు తీవ్ర ఆస్తి నష్టం కలిగించేదట. గ్రామస్తులు విష్ణుమూర్తిని శరణువేడగా వరదరాజస్వామిగా వెలిశాడని గాథ! అతివృష్టి, అనావృష్టి నుంచి నమ్మిన భక్తులను కాపాడే స్వామిని ‘వరదరాజు’ అని పిలుచుకున్నారు భక్తులు. వరదరాజస్వామి క్షేత్రపాలకుడిగా ఆంజనేయుడు వెలిశాడు. గ్రామం పొలిమేరలో ఉండే అభయాంజనేయ స్వామి సన్నిధిలో నిద్ర చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు.