హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తనపై కేసు నమోదైందంటూ వస్తున్న కథనాలపై కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి స్పందించారు. ఇంద్రపాల్రెడ్డి అనే చీటర్ తనకు రూ.3 కోట్లు ఇచ్చినట్టు చెబుతున్నాడని, అందుకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఉప్పరపల్లిలో తనకు గజం భూమి కూడా లేదని స్పష్టం చేశారు.
చెక్కులు ఇచ్చినట్టు ఉంటే అందుకు తగిన ఆధారాలు కూడా చూపించాలని పేర్కొన్నారు. కేసు పెట్టారు కాబట్టి పోలీసులే నిజానిజాలు తేలుస్తారని తెలిపారు. ఎన్నికలు దగ్గరికి వస్తుండడంతో ఇలాంటి కేసుల ద్వారా తనను దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఇంద్రపాల్పై పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు పెడతానని నరేందర్రెడ్డి హెచ్చరించారు.