హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): కస్టమ్ మిల్లింగ్ రైస్ను (సీఎమ్మార్) నిర్ణీత సమయంలో అప్పగించని మిల్లర్లపై చర్యలు తప్పవని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ హెచ్చరించారు. శనివారం పౌరసరఫరాల భవన్లో పలువురు డీఫాల్ట్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. సీఎమ్మార్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని విక్రయించినట్టు తేలితే సహించేది లేదని తేల్చి చెప్పారు.
ఇప్పటికే ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. రైస్ మిల్లర్ల నుంచి సీఎమ్మార్ సేకరణలో అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ఎంత ప్రాధాన్యమిస్తున్నామో, అదేస్థాయిలో సీఎమ్మార్ సేకరణలో కూడా ప్రదర్శించాలని సూచించారు. సీఎమ్మార్ జాప్యంతో సంస్థపై వడ్డీ భారం పడుతున్నదని చెప్పారు.