కొత్తపల్లి, ఫిబ్రవరి 19 : కరీంనగర్(Karimnagar )జిల్లా కేంద్రంలోని రేకుర్తి లయోలా విద్యా సంస్థల్లో మూడు రోజులుగా జరిగిన 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి మెన్, ఉమెన్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్(Handball competitions) పోటీలు సోమవారం ముగిసాయి. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో వరంగల్ జట్టు క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం కైవసం చేసుకోగా, రెండో స్థానంలో హైదరాబాద్ జట్టు నిలిచి రజతం, మూడో స్థానంలో కరీంనగర్ జట్టు కాంస్య పతకం సాధించగా, నాలుగో స్థానంలో రంగారెడ్డి జట్టు నిలిచింది.
అలాగే, మహిళల విభాగంలో రంగారెడ్డి జట్టు బంగారు పతకం సాధించగా, వరంగల్ రజతం, కరీంనగర్ కాంస్యం, నాలుగో స్థానంలో హైదరాబాద్ జట్టు నిలిచినట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వర్రావు, బసరవేణి లక్ష్మణ్ తెలిపారు. విజేత జట్లకు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కొత్త సతీశ్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్కుమార్, కనపర్తి రమేశ్, నమిలికొండ ప్రభాకర్ బహుమతులు ప్రదానం చేశారు.