వరంగల్ చౌరస్తా, మార్చి 27: వరంగల్లో రూ.1100 కోట్ల వ్యయంతో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, వచ్చే దసరా నుంచి ఇక్కడ పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని రాష్ట్ర రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. రాష్ట్ర పథకాలకు కేంద్రం సహకారం అందించకపోయినప్పటికీ 24 అంతస్థుల్లో, 12 లక్షల పైచిలుకు చదరపు అడుగుల వినియోగ స్థలంతో, 2000 పడకల సామర్థ్యంతో ఈ దవాఖానను నిర్మిస్తున్నామని తెలిపారు.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి మంత్రి సోమవారం దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం కేసీఆర్ సూచించిన మార్పులకు అనుగుణంగా, నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనలను అనుసరించి భవన నిర్మాణం జరుగుతున్నదని ఎల్ అండ్ టీ ప్రతినిధులు, ఆర్ అండ్ బీ అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేసి, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దసరా నాటికి వైద్య సేవలు ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ అంతటికీ వైద్యసేవలు అందిస్తున్న ఎంజీఎం దవాఖానకు మరింత బలాన్ని అందించడానికి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా అధునిక వైద్య సేవలను ఇక్కడే పొందడానికి ఈ హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. దీంతోపాటు హైదరాబాద్ ఎల్బీనగర్లో రూ.900 కోట్లతో వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన హాస్పిటల్, అల్వాల్ ప్రాంతంలో రూ. 1000 కోట్లతో మరో వెయ్యి పడకల హాస్పిటల్, 200 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం, సనత్నగర్ ప్రాంతంలో రూ.900 కోట్లతో వెయ్యి పడకల హాస్పిటల్ నిర్మిస్తున్నామని చెప్పారు.
గచ్చిబౌలిలోని టిమ్స్ హాస్పిటల్ని రూ. 1600 కోట్లతో ఆధునికీకరిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను మరింత పటిష్ఠపరచడం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తూ, వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నదని చెప్పారు. ఆయన వెంట వరంగల్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీవత్స, ఆర్డీవోలు వాసుచంద్ర, మహేందర్జీ, ఆర్అండ్బీ ఎస్ఈ గణపతిరెడ్డి పాల్గొన్నారు.
కాజీపేట అదనపు ఆర్వోబీ పనులపై ఆరా
కాజీపేటలో చేపట్టిన అదనపు ఆర్వోబీ నిర్మాణం పనుల వేగాన్ని పెంచాలని మంత్రి వేముల ఆదేశించారు. ఆర్వోబీ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన శ్రీవెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ సంస్థ ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, దేవేందర్రెడ్డి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైల్వే ట్రాక్పై నిర్మాణ పనుల అనుమతులు అందడంలో ఆలస్యం కారణంగా పనుల్లో వేగం తగ్గిందని వారు చెప్పారు.