హనుమకొండ సబర్బన్, మే 17: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది కేవలం రాజకీయ కాంక్ష మాత్రమేనని, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనే లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. మంగళవారం హనుమకొండలో వరంగల్ ఉమ్మడి జిల్లా వానకాలం వ్యవసాయ పనుల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రానికి వ్యవసాయ విజన్ లేదని విమర్శించారు. దేశంలో 60 శాతం మంది వ్యవసాయంపై జీవిస్తుంటే, వీరి బాగోగులు చూడాల్సిన కేంద్రం ఆర్థిక లాభాలు లేవని సాగును చిన్నచూపు చూస్తున్నదని మండిపడ్డారు. నాలుగు కోట్ల జనాభా ఉన్న స్పెయిన్.. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో 16 శాతానికి ఎగబాకితే, 140 కోట్ల జనాభా 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న మనదేశం మాత్రం ఎగుమతుల్లో కేవలం 2 శాతానికి దగ్గరలో నిలిచిపోవడం సిగ్గు చేటన్నారు.
ప్రస్తుతం ప్రపంచ జనాభా 770 కోట్లు ఉన్నదని, రానున్న పదేండ్లలో 900 కోట్లకు చేరనున్నదన్నారు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఏడేండ్లలో రూ. 3.75 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. మూడుసార్లు గుజరాత్కు సీఎంగా పని చేసిన నరేంద్రమోదీ ఎంత ఖర్చు చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయంలో ఎరువులకు కేంద్రం భరిస్తున్న సబ్సిడీలు కూడా నాలుగైదు రాష్ర్టాల నుంచి వచ్చే పన్నుల మొత్తమేనని ఆయన పేర్కొన్నారు.
వరి పండిస్తే తాము కొంటామని బీరాలు పలికిన బీజేపీ నాయకులు ముఖం చాటేయడమే కాకుండా వడ్లు కొనకుండా అడ్డుకొన్నారని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. రైతుల సంక్షేమమే ముఖ్యమని భావించిన సీఎం కేసీఆర్ 3 వేల కోట్ల ఆర్థిక భారాన్ని మోస్తూ వడ్లను కొంటున్నారని స్పష్టంచేశారు. కేంద్రం మాత్రం మిల్లర్లను తనిఖీల పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నదని ధ్వజమెత్తారు. మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎంగా ఉండటం మన అదృష్టమన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, శంకర్నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ అధ్యక్షులు గండ్ర జ్యోతి, మారెపల్లి సుధీర్కుమార్, కుసుమ జగదీశ్, పాగాల సంపత్రెడ్డి, అంగోతు బిందు, జక్కు శ్రీహరిణి తదితరులు పాల్గొన్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో రైతులు వ్యవసాయానికి 30 లక్షల వ్యవసాయ విద్యుత్తు పంపు సెట్లను వినియోగిస్తున్నారని, అన్నింటికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టంచేశారు. ఈ స్థాయిలో రైతుల కోసం ఉచితంగా విద్యుత్తును అందించే రాష్ట్రం ఉన్నదా అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను పార్లమెంటు సాక్షిగా స్వయంగా కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రకటించారని గుర్తుచేశారు. ఇది కేవలం సీఎం కేసీఆర్ రైతుల కోసం తెచ్చిన పథకాల వల్లే సాధ్యమైందన్నారు.