కమలాపూర్, మే 17: రైతులను తరుగు పేరుతో దోచుకుంటున్న రైస్మిల్లు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసు అధికారులను వరంగల్ సీపీ రంగనాథ్ ఆదేశించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసి రైస్మిల్లుకు పంపితే నూక అవుతుందనే సాకుతో రైస్మిల్లర్లు తరుగు తీస్తున్నట్టు రైతులు సీపీకి ఫిర్యాదు చేశారు.
దీంతో ముచ్చర్ల నాగారం క్రాస్రోడ్డు వద్ద ఉన్న సప్తగిరి రైస్మిల్లుకు పోలీస్ కమిషనర్, టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, స్థానిక పోలీసు అధికారులతో కలిసి తనిఖీ చేపట్టారు. కొనుగోలు కేంద్రంలో, రైస్మిల్లులో చేపట్టిన ధాన్యం తూకం రసీదులను పరిశీలించారు. తేడా రావడంతో తరుగు పేరుతో కోత పెట్టినట్టు రుజువైంది. దీంతో మిల్లు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలకు సీపీ ఆదేశించారు.