CP Ranganath | పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కాలేదని.. అది కాపీయింగ్ మాత్రమేనని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. వరంగల్లో పదో తరగతి హిందీ పశ్రపత్నం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆయన మీడియా సమావేశం నిర్వహించి, వివరాలను వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ సమావేశంలో ప్రశ్నపత్రాల కాపీయింగ్, లీకేజీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారన్నారు. పేపర్ బయటకు వచ్చిన విషయంలో దర్యాప్తు చేపట్టామన్నారు. ప్రశ్నపత్రం కమలాపూర్ పరీక్షా కేంద్రం నుంచి బయటకు వచ్చిందని తెలిపారు. ఓ మైనర్ బాలుడు ఉప్పల్లో ఉండే తన స్నేహితుడికి స్నేహితుడికి సహాయం చేసేందుకు ప్రశ్నపత్నం బయటకు తేవాలని భావించి.. పరీక్షా కేంద్రం వద్దకు వెళ్లి ప్రశ్నపత్రం ఫొటోలు తీశాడని పేర్కొన్నారు.
బాలుడు పరీక్షా కేంద్రం వద్ద ఉన్న చెట్టును ఎక్కి రూమ్-3 కిటికీ వద్ద ఉన్న ఓ విద్యార్థి నుంచి ప్రశ్నపత్నం తీసుకొని ఫొటోలు తీశాడన్నారు. ఆ తర్వాత బాలుడు ఫొటోను శివ గణేశ్ అనే మరో వ్యక్తికి పంపాడన్నారు. అతను ఎస్ఎస్సీ 2019-20 వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాడన్నారు. మైనర్ బాలుడు ఫొటోలు తీసింది 9.45 గంటలని, శివగణేశ్కు 9.50కి పంపినట్లు తెలిపారు. అదే గ్రూప్లో ఉన్న ఓ వ్యక్తి తన సమీప బంధువు అయిన ఓ పత్రికలో పని చేసి, ప్రస్తుతం కేఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్గా పని చేస్తున్న గుండెబోయిన మహేశ్ అనే వ్యక్తికి పంపాడన్నారు. ఆయన మరో టీవీ చానెల్లో పని చేసిన బీ ప్రశాంత్ (33) అనే వ్యక్తికి పంపగా.. అతను ఫ్రెండ్స్ గ్రూప్లో పోస్ట్ చేశాడని, ఆ తర్వాత ప్రశ్నపత్రం లీక్ అనే వార్త వైరల్గా మారిందన్నారు.
ప్రశాంత్ ‘వరంగల్ జిల్లాలో ఎస్సెస్సీ హిందీ పేపర్ లీక్ అయినట్లు బ్రేకింగ్ న్యూస్ క్రియేట్ చేశాడన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ప్రశ్నపత్నం లీక్ అయ్యిందంటూ ప్రజలను, విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని సీపీ తెలిపారు. అదే సమయంలో వార్తను బ్రేకింగ్ న్యూస్ను క్రియేట్ చేసి హైదరాబాద్లో ఉన్న మీడియా ఉన్నతాధికారులతో పాటు బీజేపీ నేత బండి సంజయ్కి సైతం పంపారని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రశ్నపత్రం ఫొటోలు 9.45కి తీస్తే.. వైరల్ అయ్యేందుకు గంటకుపైగా సమయం పట్టిందన్నారు. ఇప్పటికే ప్రశ్నపత్రం బయటకు వచ్చినా ప్రయోజనం లేదని, విద్యార్థులంతా పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లిపోయారన్నారు.
అయితే, పరీక్ష రాసే విద్యార్థులకు చిట్టీలు ఇచ్చేందుకు, ఇన్విజిలేటర్లకు బిట్స్ అందించేందుకు పనికొస్తుందన్నారు. ఇది ఏమాత్రం లీకేజీ కాదని, కాపీయింగ్ అన్నారు. మాల్ప్రాక్టీస్ చట్టం కింద కేసు కేసు నమోదు చేశామన్నారు. మైనర్ బాలుడిని జువైనల్ హోంకు తరలిస్తామని, శివగణేశ్, ప్రశాంత్, మహేశ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందన్నారు. వాస్తవానికి ఓ బాలుడు తన స్నేహితుడికి సహకరించేందుకు ప్రశ్నపత్రం తీసుకువస్తే.. మొత్తం పరీక్ష లీక్ అయినట్లుగా తల్లిదండ్రులు ఆందోళనకు గురి చేసే ప్రయత్నం జరిగిందని విచారణలో తేలిందన్నారు.
ప్రశాంత్ అనే వ్యక్తి పేపర్ 9.30 గంటలకు లీక్ అయినట్లుగా తప్పుడు ప్రచారం చేశాడని.. వాస్తవానికి పేపర్ ఫొటోలు తీసింది 9.40 గంటలకని.. 9.50 గంటలకు మరో వ్యక్తికి పంపాడన్నారు. ఈ కేసులో ఎగ్జామినేషన్ విధానమే సరిగా జరగడం లేదని చూపే ఉద్దేశం కనిపించిందని, ముందుగానే పేపర్ లీక్ అయినట్లుగా దురుద్దేశంతో ప్రచారం చేశారన్నారు. ఇలా ఎందుకు చేశాడనే విషయాన్ని బయటకు తెస్తామన్నారు. మీడియాకు సైతం నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రశాంత్ ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ తప్పుడు ప్రచారం చేశాడన్నారు. అతనే చాలా మందికి ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ చాలా మందికి షేర్ చేసినట్లు సీపీ వివరించారు. ఈ సందర్భంగా నిందితులను గుర్తించిన పోలీస్ సిబ్బందిని సీపీ అభినందించారు.