అభివృద్ధిని అడ్డుకొనేందుకు బీజేపీ కుట్రలు: మంత్రి ఎర్రబెల్లి
హన్మకొండ, జూన్ 19: వరంగల్ నగరాన్ని మెడికల్ హబ్గా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. సుమారు 56.30 ఎకరాల్లో 30 అంతస్తులతో అతి పెద్ద మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించేందుకు నిర్ణయించారని చెప్పారు. సోమవారం సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో శనివారం మంత్రి ఎర్రబెల్లి హన్మకొండలోని క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం 10.30 గంటలకు వరంగల్ సెంట్రల్ జైల్ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారని తెలిపారు. 11 గంటలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, 11.45 గంటలకు హన్మకొండ సుబేదారిలోని కలెక్టర్ భవనాలను ప్రారంభిస్తారని వివరించారు. మధ్యాహ్నం భోజనం అనంతరం 2.30 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లాకు బయలుదేరి వెళ్తారని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకొనేందుకు బీజేపీ అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నదని మండిపడ్డారు. సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఇష్టం లేని ఆ పార్టీ నాయకులు కోర్టుకు వెళ్లారని ఆగ్రహించారు. అభివృద్ధిని అడ్డుకొనే వారు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.