హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై వక్ఫ్ బోర్డు దృష్టి సారించింది. ఈ మేరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసి ఉల్లా ఖాన్ ఆధ్వర్యంలో శనివారం కొనసాగిన వక్ఫ్ బోర్డు సమావేశం పలు కీలక తీర్మానాలు చేసింది. సమావేశంలో మొత్తం 110 అజెండాలపై చర్చించారు.
సంగారెడ్డిలో మినీ హజ్ హౌస్ నిర్మాణానికి వక్ఫ్ భూమిని కేటాయించాలని నిర్ణయించారు. వక్ఫ్ భూములను లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం మసి ఉల్లా ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నదని కొనియాడారు. వివిధ మసీదులను ఏర్పాటు చేసి, ముతవల్లీలను నియమించిందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల రక్షణ, అభివృద్ధికి అనేక చర్యలు తీసుకొంటున్నదని తెలిపారు. సమావేశంలో వక్ఫ్ బోర్డు సభ్యులు అక్బర్ నిజాముద్దీన్ హుస్సానీ, జాకర్ హుస్సేన్ జావీద్, అబుల్ ఫతే బందగీ భాషా, మాలిక్ మొహతాషిమ్ ఖాన్, నిసార్ హుస్సేన్ హైదర్ అఘా, కౌసర్ మోహియుద్దీన్, ఎమ్మెల్యే ఫరూక్ హుస్సేన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఐపీఎస్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.