వరంగల్ : జిల్లాలోని ఖానాపురం మండలం పాకాల అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం. సోమవారం తెల్లవారుజామున కూరగాయల కోసం నర్సంపేట వైపు వస్తున్న వారికి పాకాల సంగెం కాల్వ సమీపంలో పులి రోడ్డు దాటుతూ కనిపించిందని తెలిసింది.
ఈ విషయం తెలిసి వాహనదారులు భయంతో పులి అడవిలోకి వెళ్లే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత నర్సంపేటకు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ విషయమై నర్సంపేట ఎఫ్ఆర్వో రమేశ్ను వివరణ కోరగా.. పాకాల సమీపంలో పులి కనిపించినట్లు ప్రజలు సమాచారం ఇచ్చారని, ఆనవాళ్లు గుర్తించేందుకు అన్వేషిస్తున్నామని చెప్పారు. గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, అడవి లోపలికి వెళ్లకూడదని సూచించారు.