వనపర్తి టౌన్, నవంబర్ 13 : వనపర్తిలో కాంగ్రెస్ నాయకులు డబ్బుల కోసం కుస్తీ పడుతున్నారు. వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేయగా.. అన్ని మండలాలు, గ్రామాల నుంచి ప్రజలను ర్యాలీ కోసం తరలించారు. మనిషికి రూ.300 నుంచి రూ.500 చొప్పున చెల్లిస్తామని చెప్పి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించారు. ర్యాలీకి వచ్చిన జనాలకు డబ్బులు చెల్లించలేదని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కాంగ్రెస్లో మూడు వర్గాలు ఉన్నా, ప్రధానంగా మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మేఘారెడ్డి వర్గాల మధ్య అంతర్గత కలహాలు నెలకొన్నాయి. డబ్బులు చెల్లించకపోవడంతో రెండు, మూడు రోజులుగా కార్యకర్తలు తిరిగితిరిగి వేసారి చిన్నారెడ్డి ఇంటి ఎదుట తమ అసహనాన్ని తెలిపారు. మేఘారెడ్డి నాయకత్వం వల్లే ఈ దుస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.