హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వీఆర్వోలను ఇతర ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఉన్న వీరిని.. ఆ శాఖ మినహా మిగతా శాఖల్లోని ఖాళీల్లోకి సర్దుబాటు చేయాలని సూచించింది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త శాఖల్లో పునర్నియమించే అధికారాన్ని కలెక్టర్లకు కల్పించింది. ఇప్పటికే జిల్లాలవారీగా వీఆర్వోల జాబితా, ఇతర శాఖల్లోని ఖాళీల సంఖ్యతో సమగ్ర నివేదికలు తయారుచేశారు. వాటి ఆధారంగా సర్దుబాటు జరగాలని ఆర్థికశాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ ఉత్తర్వులిచ్చారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం గతంలోనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేవలం వ్యవస్థనే రద్దు చేస్తున్నామని, వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఆనాడే ప్రకటించారు. తాజాగా ఇది అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 6,874 వీఆర్వో పోస్టులు ఉండగా, 5,385 మంది వీఆర్వోలు పనిచేస్తున్నారు.వీరంతా ఇతరశాఖల్లోకి బదిలీ అవుతారు.
ఆప్షన్లు ఇవ్వండి: ట్రెసా
వీఆర్వోల సర్దుబాటు లాటరీ పద్ధతిలో కాకుండా సీనియారిటీ ప్రతిపాదికన ఆప్షన్లు ఇచ్చి నిర్వహించాలని ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు వంగ రవీందర్రెడ్డి, గౌతమ్కుమార్ ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. బదిలీచేసే క్రమంలో రెవెన్యూ శాఖలోని ఖాళీలను సైతం చూపించి, కొందరిని ఈ శాఖలోనే సర్దుబాటు చేయాలని విన్నవించింది. భూసంబంధిత పనులతో పాటు సాధారణ పరిపాలన, వివిధ ఎన్నికలు, శాంతి భద్రతలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, వివిధ రకాల ధ్రువ పత్రాల జారీ, వివిధ రకాల సంక్షే మ పథకాల అమలు కోసం లబ్ధిదారుల ఎం పిక వంటి పలు బాధ్యతలు రెవెన్యూ వ్యవస్థపై ఉన్నాయని చెప్పారు. మండలానికి కనీసం ఐదుగురిని జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో అదనపు రెవెన్యూ ఇన్స్పెక్టర్ల పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు.