కల్యాణలక్ష్మి మంజూరుకు రూ.5 వేలు డిమాండ్
నల్లబెల్లి, జూన్ 28 : కల్యాణలక్ష్మి మంజూరు చేసేందుకు లబ్ధిదారునుంచి రూ.5 వేలు లంచం తీసుకొంటూ వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపెల్లి వీఆర్వో సోమవారం ఏసీబీకీ చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడపెల్లికి చెందిన దేవరాజు యాకాంబ్రం-పద్మ వృత్తిరీత్యా నర్సంపేట మండలం రాజుపేటలో నివాసముంటున్నారు. వీరి కుమార్తె మౌనికకు జనవరిలో వివాహం జరిపించారు. కల్యాణలక్ష్మి పథకం మంజూరుకోసం మేడపెల్లి వీఆర్వో మెదరబోయిన అయిలయ్యను యాకాంబ్రం ఆశ్రయించాడు. రూ.5వేలు లంచం ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. సోమవారం రాజుపేటలోని తన నివాసంలో వీఆర్వోకు యాకాంబ్రం రూ.3 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీఆర్వోపై ఏసీబీ అధికారులు నల్లబెల్లి తాసిల్దార్ కార్యాలయంలో విచారణ చేశారు.