రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, 7వ తరగతి పాసైనవారు, 10వ తరగతి పాసైనవారు, ఇంటర్ పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో వారిని భర్తీ చేస్తాం. తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్ఏల త్యాగపూరిత సేవ గొప్పది. మారిన పరిస్థితుల్లో వీఆర్ఏల వృత్తికి ప్రాధాన్యం తగ్గింది. ఈ నేపథ్యంలో వారిని పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటాం.
– ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): భూస్వామ్య వ్యవస్థకు చిహ్నంగా ఉన్న వీఆర్ఏ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. వీఆర్ఏలందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్నది. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 20,555 మంది వీఆర్ఏలను సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం విడుదల చేయాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ అంశాలపై ఆదివారం రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నీరటి, మసూరు, లషర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలుస్తూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు, నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హతల ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. సామాజిక పరిణామ క్రమంలో మార్పులకు అనుగుణంగా, ప్రజల అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వ విధానమని, ఈ విధానాన్ని అనుసరించే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నామని వివరించారు.
వీఆర్ఏల సేవ గొప్పది
వ్యవసాయం అభివృద్ధి చెంది సాగునీటి విధానం అమల్లోకి వచ్చిన నాటి కాలంలో గ్రామాల్లో నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంతోపాటు గ్రామ రెవెన్యూ అవసరాలకోసం గ్రామ సహాయకుల వ్యవస్థ ఏర్పాటైందని, అది ఇప్పుడు వీఆర్ఏలుగా రూపాంతరం చెందిందని సీఎం కేసీఆర్ అన్నారు. నాటి నుంచి తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్ఏల త్యాగపూరిత సేవ గొప్పదని కొనియాడారు. మారిన పరిస్థితుల్లో వీఆర్ఏల వృత్తికి ప్రాధాన్యం తగ్గిందన్నారు. ఈ నేపథ్యంలో వారికి రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పిం చి, పర్మినెంట్ చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని స్పష్టం చేశారు. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలతో, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేసేవారి కోసం తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటుందని పునరుద్ఘాటించారు. ఇప్పటికే ఎవరూ అడగకుండానే సమాజానికి సేవలు చేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచి వారి సంక్షేమానికి పాటుపడిన విషయాన్ని గుర్తు చేశారు. ‘సఫాయన్నా.. నీకు సలామన్నా..’ అంటూ ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’కు అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని చెప్పారు.
క్రమబద్ధీకరణ, సర్దుబాటు విధానం
‘రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, 7వ తరగతి పాసైనవారు, 10వ తరగతి పాసైనవారు, ఇంటర్ పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. వీరి విద్యార్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగ క్యాటగిరీలను నిర్ధారిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో వారిని భర్తీ చేస్తాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టి, విధివిధానాలు ఖరారు చేసి, సోమవారం ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నిర్ణయించారు. 2014 జూన్ 2 తర్వాత 61 ఏండ్ల లోపు ఉండి విధులు నిర్వహిస్తూ ఏ కారణం చేతనైనా మరణించిన వీఆర్ఏల వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. చనిపోయిన వీఆర్ఏల వారసుల వివరాలు, వారి విద్యార్హతలు త్వరలో సేకరించాలని అధికారులకు, వీఆర్ఏ జేఏసీ నేతలకు సూచించారు. వారికి కూడా అర్హతల మేరకు, ఆయా శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించారు.
జీవితాంతం రుణపడి ఉంటాం
వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం కేసీఆర్కు వీఆర్ఏ జేఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. మసూరు తదితర పేర్లతో తరతరాలుగా వెంటాడుతున్న సామాజిక వివక్షతో కూడిన విధుల నుంచి తమకు విముక్తి కల్పించారని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేసి, తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని చెప్పారు. సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తాతా మధు, ఎమ్మెల్యేలు బాల సుమన్, జీవన్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, రోహిత్రెడ్డి, మదన్రెడ్డి, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు సోమేశ్కుమార్, సీఎస్ శాంతికుమారి, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగరావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితాసభర్వాల్, దాసోజు శ్రవణ్, వీఆర్ఏ జేఏసీ చైర్మన్ రాజయ్య, కో చైర్మన్ రమేశ్ బహదూర్, సెక్రటరీలు దాదేమియా, విజయ్, రవి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
జలమండలి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డు (ఎచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని అమలు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా దాదాపు 4 వేల మంది వాటర్ బోర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నది. ఈ సందర్భంగా మెట్రో వాటర్ వర్స్ యూనియన్ అధ్యక్షుడు జీ రాంబాబు యాదవ్, యూనియన్ నేతలు సీఎం కేసీఆర్ను ప్రగతి భవన్లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.