నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 10: వీఆర్ఏల్లో ఆనందం వెల్లివిరిసింది. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడమేగాకుండా పలు శాఖలకు కేటాయిస్తూ నియామక పత్రాలు అందజేయడంతో సంబురపడ్డారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రుల చేతుల మీదుగా పత్రాలు అందుకొన్న వీఆర్ఏలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆనందంలో మునిగిపోయారు. తమను పేసేల్ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని అన్నారు. గురువారం జనగామలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాలోని 314 మంది వీఆర్ఏలు, 10 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా వీఆర్ఏలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. మహబూబాబాద్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కరీంనగర్లో 442 మందికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఖమ్మం జిల్లాలోని 496 మందికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, నిర్మల్లో 569 మందికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పత్రాలు అందజేశారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో 508 మంది వీఆర్ఏలు, 34 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పత్రాలు పంపిణీ చేశారు.
19న వీఆర్ఏలతో ఆత్మీయ సమ్మేళనం
వనపర్తిలో ఈనెల 19న వీఆర్ఏలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. గురువారం వనపర్తి, నాగర్కర్నూల్లో వీఆర్ఏలకు నియామక పత్రాలు అందజేశారు.