Telangana | హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించిందని.. అలాగని ప్రతి ఒక్కరు ఆ రోజును హాలిడే (సెలవు రోజు)గా కాకుండా ఓటింగ్ డే (ఓటు వేసే దినం)గా గుర్తించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ కోరారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తిచేశారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్నదని, ఈసారి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి విధి, బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో ఓటర్లు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని తెలిపారు. బీఆర్కేఆర్ భవన్లో గురువారం ఆయన ఇతర అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఓటర్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, పోలీసులు సహా దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో 4,70,270 పోస్టల్ బ్యాలట్లను ప్రింట్ చేశామని, ఈవీఎంల కోసం 8,84,584 బ్యాలట్ పేపర్లను ముద్రించామని చెప్పారు. టెండర్ ఓటు, చాలెంజ్ ఓటు కోసం అదనంగా బ్యాలెట్ పేపర్లను ముద్రించామని తెలిపారు. 51 లక్షల ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇండ్లకు పంపించామని చెప్పారు.
ఓట్ల లెక్కింపునకు ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందని వికాస్రాజ్ తెలిపారు. పరిశీలకుడి అనుమతితో ప్రతి రౌండ్ ఫలితాన్ని రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారని వివరించారు. ఈ ఎన్నికల్లో తొలిసారి హోం ఓటింగ్ విధానాన్ని అమలు చేశామని, ఇప్పటివరకు 14 వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని వికాస్రాజ్ తెలిపారు. ఇందులో 80 ఏండ్లు దాటినవారు 9,386 మంది, దివ్యాంగులు 5,022 మంది, అత్యవసర సర్వీసుల ఉద్యోగులు 253 మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో 2.81 కోట్ల (86%) మంది ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేశామని చెప్పారు. ఈవీఎంలు తీసుకవెళ్లే ప్రతి వాహనానికి జీపీఎస్ను అమర్చనున్నామని సీఈవో వికాస్రాజ్ తెలిపారు. ప్రైవేటు వాహనాల్లో ఈవీఎంలను తరలించడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సూచించిన వాహనాలు కాకుండా ఇతర వాహనాల్లో ఈవీఎంలను తరలిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై 10,106 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని వికాస్రాజ్ తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అనుచరులపై 777 కేసులు నమోదయ్యాయని వివరించారు. ఇప్పటివరకు రూ.669 కోట్లను సీజ్ చేశామని చెప్పారు. ఇందులో రూ.260 కోట్ల నగదు, రూ.108 కోట్ల విలువైన మద్యం ఉందని తెలిపారు. బంగారం, ఇతర వస్తువులు రూ.183 కోట్లు, ఉచితాలు రూ. 81కోట్ల విలువైన బహుమతులు ఉన్నాయని తెలిపారు. రైతు బంధుపై ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరిందని, దానిపై ప్రభుత్వాన్ని వివరణ అడిగామని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ సీఈవో లోకేశ్కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈవో సత్యవాణి పాల్గొన్నారు.