Telangana Assembly Elections | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఏర్పడలేదని చెప్పారు. శుక్రవారం ఆయన బీఆర్కే భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. గురువారం రాత్రి వరకు అనేక నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగిందని తెలిపారు. రాష్ట్రంలో 79 నియోజకవర్గాల్లో 75% కంటే ఎక్కువ పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి వెబ్క్యాస్టింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు.
ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలు అన్నింటినీ పార్టీ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్రూంలకు తరలించామని వికాస్రాజ్ వెల్లడించారు. స్ట్రాంగ్రూంలకు అన్ని రకాలుగా భద్రత చర్యలు తీసుకున్నామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు ఉన్నాయని వివరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉంటారని వెల్లడించారు. కౌంటింగ్ కోసం మొత్తం 1,766 టేబుల్స్ను ఏర్పాటు చేశామని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, వీరిలో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్జెండర్ ఉన్నారని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అయిన చాంద్రాయణగుట్టకు సంబంధించిన వీడియోపై నివేదిక అడిగామని వెల్లడించారు. నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ సీఈవో లోకేశ్కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈవో సత్యవాణి
పాల్గొన్నారు.