హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : త్వరలో ఎన్నికలు నిర్వహించనున్న మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం తుది ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఖరారు చేసింది. మొత్తం 9 జిల్లాలు, 19 రెవెన్యూ డివిజన్లల్లో 29,501 మంది ఓటర్లున్నట్టు ప్రకటించింది. వీరిలో 15,425 మంది పురుష ఓటర్లు కాగా, 14,074 మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. జిల్లాల వారీగా తీసుకొంటే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 8,687 మంది ఓటర్లుండగా, ఆ తర్వాత మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో 6,771 ఓటర్లున్నారు. అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 688, జోగులాంబ గద్వాల జిల్లాలో 873 మంది చొప్పున ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 126 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా డాక్టర్ కాటేపల్లి జనార్దన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగియనున్నది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గం నుంచి గుర్రం చెన్నకేశవరెడ్డి, కాటేపల్లి జనార్దన్రెడ్డి, మాణిక్ రెడ్డి సహ మరికొంత మంది అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి.