ఖమ్మం, జనవరి 17: లక్షల మంది ప్రజలు హాజరవుతున్న గొప్ప భారీ బహిరంగ సభలో వలంటీర్గా పనిచేస్తున్న వారిపై గురుతర బాధ్యత ఉన్నదని ఖమ్మం బీఆర్ఎస్ సభ ఇన్చార్జి, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. టీఆర్ఎస్ స్థాపించిన 2001లో కరీంనగర్ సింహగర్జనలో తానూ ఒక వలంటీర్నే అని గుర్తుచేశారు. ఖమ్మం నగరానికి చెందిన సుమారు వెయ్యిమంది వలంటీర్లు సభాప్రాంగణం వద్ద మంగళవారం ఉదయం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి హరీశ్రావు మాట్లాడుతూ.. బుధవారం మధ్యా హ్నం 12 గంటల వరకు సభా ప్రాంగణానికి వలంటీర్లు చేరుకుని సభకు వచ్చే ప్రజలను వారికి కేటాయించిన కుర్చీల్లో కూర్చునే విధంగా చూడాలని కోరారు. సభ పూర్తయ్యే వరకు విధి నిర్వహణలో ఉండాలని, పోలీసులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. మహిళలు కూర్చునే బ్లాకుల్లో మహిళా వలంటీర్లే ఉండాలని ఆదేశించారు. మహిళల కోసం ప్రత్యేకంగా 70 టాయిలెట్లను ప్రాంగణానికి దూరంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆ విషయాన్ని మహిళా వలంటీర్లు మహిళలకు తెలియజేయాలని కోరారు. అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. వలంటీర్లందరూ నిర్దేశిత లక్ష్యం మేరకు క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. తర్వాత మంత్రులిద్దరూ సభావేదికను పరిశీలించారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.