హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వరకే చదివాను.. నాకేం రాదు.. చదువుకొన్న చదువు.. తెచ్చుకొన్న మార్కులతో ప్రయోజనం లేదు.. మరీ ఇప్పుడెలా.. అని సంకోచంలో ఉన్నారా? విద్యార్థులకు ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఎదురుకాకుండా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. పాఠశాల దశలోనే విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని వంద సర్కారు బడుల్లో ఎనిమిది రకాలైన వృత్తి విద్యాకోర్సులను ప్రవేశపెట్టనున్నారు. అందుకుగాను 9, 10 తరగతి విద్యార్థులకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద అమలవుతున్న ఆయా కోర్సుల్లో తర్ఫీదునిస్తారు. ఎస్సెస్సీ బోర్డు ద్వారా పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. పాసైన వారికి సర్టిఫికెట్లు జారీచేస్తారు.
నైపుణ్యతలే నిలబెడుతాయి
ఇటీవలి కాలంలో ప్రపంచమంతా స్కిల్ డెవలప్మెంట్వైపు అడుగులేస్తున్నది. దాంతో అన్ని రంగాల్లో నైపుణ్యశిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్ వరకు చదివినా నైపుణ్యత లేమి కారణంగా చాలా మంది స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు చదువు పూర్తికాగానే ఏదో ఒక రంగంలో స్థిరపడేలా పాఠశాల స్థాయిలోనే నైపుణ్యతను నేర్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 192 మాడల్ స్కూళ్లల్లో వొకేషనల్ విద్యను అమలుచేస్తున్నారు. 2021-22లో 71,345 విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరి ప్రయోజకులయ్యారు. సీబీఎస్ఈ కూడా 40కి పైగా వొకేషనల్ కోర్సులను నిర్వహిస్తున్నది. ఇదే కోవలో కొత్తగా 100 ప్రభుత్వ బడుల్లో 8 రకాలైన కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.