హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): పేద బ్రాహ్మణ విద్యార్థులు విదేశాల్లో చదువుకొనేందుకు ఉద్దేశించిన వివేకానంద విదేశీ విద్యా పథకం (వీవోఈఎస్), ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన బెస్ట్ (బీఈఎస్టీ-బెస్ట్) పథకానికి అభ్యర్థుల ఎంపిక కోసం శనివారం నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ రెండు పథకాల ద్వారా ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు రూ. 195 కోట్లు వెచ్చించగా, దాదాపు 5 వేల మందికి లబ్ధి చేకూరింది. వీవోఈఎస్లో భాగంగా విద్యార్థులకు గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు సహాయం అందిస్తున్నారు.
2017 నుంచి ఈ పథ కం కింద ఇప్పటివరకు 738 మందికి రూ.73 కోట్లకుపైగా సహాయం అందించారు. మరో 30 మంది వరకు విద్యార్థులను ఎంపికచేయగా, వీరికి ఆర్థిక సహాయం అందాల్సి ఉన్నది. ఈ పథ కం కింద లబ్ధిపొందిన పలువురు విద్యార్థులు ఇప్పటికే ప్రఖ్యాత సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. బెస్ట్ కింద 4,233 మందికి రూ.122 కోట్ల పైచిలుకు సహాయం అందించారు. ఈ పథకం కింద మరో 600 మంది అభ్యర్థుల ఎంపిక పూర్తికాగా, వీరికి ఆర్థిక సాయం అందాల్సి ఉన్నది. ఈ పథకం కింద గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు సాయం అందిస్తారు. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి మరోసారి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు. అర్హులు దరఖాస్తు చేసుకొని లబ్ధిపొందాలని బ్రాహ్మణ సేవా వాహిని రాష్ట్ర అధ్యక్షుడు రఘుకిరణాచార్యులు పిలుపునిచ్చారు.