భూదాన్పోచంపల్లి సెప్టెంబర్ 13: తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, సంప్రదాయ చేతి వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోస్తున్నదని జార్ఖండ్ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ డిప్యూటీ కలెక్టర్ల బృందం కొనియాడింది. భారత దర్శన్లో భాగంగా బుధవారం భూదాన్ పోచంపల్లి పర్యాటక కేంద్రాన్ని బృందం సభ్యులు సందర్శించారు.
ఈ సందర్భంగా టూరిజం సెంటర్, మిషన్ కాకతీయ పథకం కింద పోచంపల్లి పెద్దచెరువు అభివృద్ధి, జలాల్పూర్ పల్లె ప్రకృతి వనం, ఎంపీడీవో కార్యాలయాన్ని వారు సందర్శించారు. సంప్రదాయ చేనేత మగ్గాలను పరిశీలించారు. చేనేత కళాకారుల నైపుణ్యాన్ని కొనియాడారు. వారం రోజుల క్షేత్ర పర్యటనలో భాగంగా గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు ఇక్కడికి వచ్చినట్టు ఫ్యాకల్టీ వినోద్ తెలిపారు.