హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్నుంచి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు తొలికూత పెట్టింది. విశాఖపట్నం వరకు నడువనున్న ఈ సెమీ హైస్పీడ్ రైలు బుధవారం పట్టాలెక్కింది. న్యూఢిల్లీ నుంచి ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, జీ కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు.
ఈ రైలులో మొత్తం 16 బోగీలు ఉండగా.. వాటిలో రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్ చైర్కార్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మిగిలిన 14లో దాదాపు 13 ఏసీ చైర్కార్ బోగీలు ఉంటాయని వివరించారు. మొత్తం సీట్ల సామర్థ్యం 1,128గా ఉన్నట్టు చెప్పారు. కాగా, ఈ వందేభారత్ రైలు రాకపోకలు సోమవారం నుంచి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రారంభమయ్యాయి.
టికెట్లను ఐఆర్సీటీసీ, ఇతర మాధ్యమాల ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. వందేభారత్ రైలు 699 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 8.30 గంటల్లో చేరుకునేలా వేగాన్ని నిర్దేశించినట్టు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, దక్షిణ మధ్య రైల్వే జోన్ జీఎం అరుణ్కుమార్ జైన్, సీపీఆర్వో రాకేశ్, ఇతర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సామాన్యులకు అందకుండా టికెట్ ధరలు
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు టికెట్ల ధరలపై సామాన్యుడు పెదవి విరుస్తున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నం వరకు రూ.3,170 చార్జీ వసూలు చేస్తున్నారు. ఏసీ చైర్ కార్లో ప్రయాణించాలంటే రూ.1,720 చెల్లించాలి. సికింద్రాబాద్ -ఖమ్మం టికెట్ ధర రూ.750గా నిర్ణయించారు. ఇంత మొత్తం చెల్లించి టికెట్ కొంటే సికింద్రాబాద్ నుంచి 2.45 గంటల సమయం పడుతున్నదని, అదే గరీబ్ రథ్ రూ.420కే 3 ఏసీ (బెర్త్)లో మూడు గంటల్లో చేరుకోవచ్చని ప్రయాణికులు పేర్కొంటున్నారు. అలాగే, వందేభారత్ రైలులో బెర్తులే లేవని, వృద్ధులు, మహిళలు అన్ని గంటలపాటు కూర్చొని ఎలా ప్రయాణిస్తారని ప్రశ్నిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, ఆటోమెటిక్ డోర్లు, సీసీ కెమెరాలు, ఉచిత వైఫై పేరుతో రైల్వేశాఖ ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నదని మండిపడుతున్నారు.