డిజిటల్ హైట్ మెజరింగ్ మిషన్ల వాడకం
ప్రతి ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట
ఫిజికల్ ఈవెంట్లు మరింత సరళతరం
పోలీసు అభ్యర్థులకు మూడు ఈవెంట్లే
టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): పోలీసు ఉద్యోగాల భర్తీలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియమక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు చెప్పారు. వీలైనంత వరకు ప్రతి దశలోనూ సాంకేతికతను వినియోగిస్తామని తెలిపారు. ప్రిలిమ్స్ తర్వాత అర్హులైన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్లో అత్యంత కీలకమైన ఎత్తు కొలతలు తీయడానికి ఈ సారి డిజిటల్ హైట్ మెజరింగ్ మిషన్లను వాడుతామని చెప్పారు. దీనివల్ల మానవ జోక్యం తగ్గడంతోపాటు ఎలాంటి సందేహాలకు తావులేకుండా కచ్చితమైన కొలతలు తీసేందుకు వీలవుతుందని తెలిపారు. ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. గత రిక్రూట్మెంట్లో డిజిటల్ హైట్ మెజరింగ్ మిషన్లను ప్రయోగాత్మకంగా వాడామని, ఈ సారి పూర్తిస్థాయిలో వినియోగిస్తామని వెల్లడించారు. ప్రిలిమినరీ పరీక్ష మొదలు తుది రాత పరీక్ష వరకు ప్రతి దశలోనూ అభ్యర్థి నుంచి బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకుంటామని, దీనివల్ల ఒకరి బదులు మరొకరు పరీక్షకు హాజరయ్యే ప్రసక్తే ఉండబోదని తెలిపారు.
పురుషులకు, మహిళలకు సమానంగా మూడు ఫిజికల్ ఈవెంట్స్
పురుషులకు, మహిళలకు సమానంగా మూడు ఫిజికల్ ఈవెంట్స్ మాత్రమే ఉండేలా మార్పులు చేసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. పురుషులకు 1,600 మీటర్ల పరుగు, మహిళలకు 800 మీటర్ల పరుగు, ఇద్దరు అభ్యర్థులకు షాట్పుట్, లాంగ్జంప్ మాత్రమే ఉంటాయని చెప్పారు. అభ్యర్థులు గాయాలపాలవుతున్న కారణంగా హైజంప్ను తీసేసినట్టు తెలిపారు. పురుషులకు ఛాతి కొలతను కూడా తీసేసినట్టు చెప్పారు. మహిళా అభ్యర్థులకు ఏపీ సహా ఇతర రాష్ర్టాల్లో 1,600 మీటర్ల పరుగు ఉందని, మన దగ్గర 800 మీటర్ల పరుగు మాత్రమే పెట్టినట్టు తెలిపారు. పోలీస్ ఉద్యోగాలకు అవసరమైన శారీరక దృఢత్వం ఉన్న వారు ఎంపికయ్యేలా ప్రక్రియలో సరళత తెచ్చినట్టు తెలిపారు. పరుగులో నమోదైన సమయానికి మాత్రమే మెరిట్ తీసుకుంటారని, షాట్పుట్, లాంగ్జంప్ క్వాలిఫై అయితే సరిపోతుందని పేర్కొన్నారు. షాట్పుట్, లాంగ్ జంప్ విషయంలోనూ అర్హత సాధించే దూరాల వద్ద ఎరుపు రంగులో గుర్తు పెడతామని, అది దాటిన వారు అర్హులుగా, దాటని వారిని అనర్హులుగా గుర్తిస్తామని వివరించారు.