మానవపాడు : కండ్లలో నుంచి నీరు రావడం సహజమే. కండ్లలో నుంచి చిన్న రాళ్లు రావడమూ చూశాం. కానీ, తొలిసారిగా ఓ బాలిక కండ్లలో నుంచి బియ్యపు గింజలు వస్తున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. గత మూడు నాలుగు రోజులుగా ఓ చిన్నారి కండ్లలో నుంచి చిన్న చిన్న రాళ్లు, బియ్యపు గింజలు వస్తుండడం విస్మయానికి గురి చేస్తున్నది. 15 నిమిషాలకు ఒకసారి బియ్యపు గింజలు, రాళ్లు వస్తుండడంతో నొప్పి భరించలేక చిన్నారి నరకయాతనకు గురవుతున్నది.
వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని చెందిన నంద్యాల రంగన్న-లక్ష్మి దంపతులు దీపాళి (11) అనే బాలికను పెంచుకుంటున్నారు. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో చిన్ననాటి నుంచి దీపాళిని పెంచుకుంటున్నారు. గత మూడు రోజులుగా బాలిక కండ్లలో నుంచి చిన్న రాళ్లు, బియ్యం గింజలు వస్తున్నాయి. ఇంటి పక్కల వారికి, స్థానిక వైద్యులకు చూయించిన ఎవరూ నమ్మలేదు. కంటి నుంచి నీరు కారడంతో పాటు రాళ్లు, బియ్యం గింజలు వచ్చే సమయంలో తీవ్రమైన నొప్పితో అల్లాడుతున్నది.
దీంతో చికిత్స నిమిత్తం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి బాలికను తరలించారు. అక్కడ వైద్యులు స్కానింగ్ పరీక్షలు నిర్వహించి.. ఏం సమస్యలేదని చెప్పి పంపారు. దీంతో దంపతులు ఇద్దరు చేసేది లేక దీపాళిని తీసుకొని ఇంటికి తీసుకువచ్చారు. ప్రతి రోజూ 10 నుంచి 12 చిన్న చిన్న రాళ్లు బయటకు వస్తున్నాయి. కంటి నుంచి నీరుతో పాటు రాళ్లు, బియ్యం గింజలు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.