Kamareddy Accident | కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్ల మధ్య స్కూటీ ఇరుక్కోవడంతో తొమ్మిదో తరగతి విద్యార్థి దుర్మరణం చెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డిలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన కూచని హేమంత్ (15), చింతల లోకేష్ ఇద్దరు స్నేహితులు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. వాళ్లిద్దరూ శుక్రవారం సాయంత్రం బంధువుల ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకుని, డ్రైవింగ్ నేర్చుకునేందుకు రోడ్డు మీదకు వచ్చారు. ఇంటర్నేషనల్ హోటల్ ఎదురుగా ఉన్న రహదారిపై వారు వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ కారు వేగంగా వారిని ఢీకొట్టింది. దీంతో రెండు కార్ల మధ్య ఎలక్ట్రిక్ స్కూటీ ఇరుక్కుని నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో హేమంత్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. లోకేష్ తీవ్రంగా గాయపడ్డాడు.
క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి కారణమైన కారును నడిపింది కూడా మైనర్ బాలుడేనని పోలీసులు గుర్తించారు.
ఇదిలా ఉంటే.. లోకేష్, హేమంత్ ఇద్దరివి నిరుపేద కుటుంబాలే. ఇద్దరికి తండ్రులు లేరని తెలుస్తోంది. హేమంత్ తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి లావణ్య ఒక్కగానొక్క కుమారుడిని పోషిస్తోంది. ఇక లోకేష్ తండ్రి దశరథ్ నెలరోజుల కిందటే అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లి రాజేశ్వరి కూలీపనులు చేసుకుంటూ కుమారుడిని, కూతుర్ని పోషిస్తోంది. ఇలాంటి సమయంలో జరిగిన ఈ ప్రమాదం రెండు కుటుంబాలను పెను విషాదంలోకి నెట్టింది.
సీసీటీవీ ఫుటేజ్
కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం
రెండు కార్ల మధ్య ఇరుక్కున్న స్కూటీ, 9వ తరగతి బాలుడు మృతి
కామారెడ్డి పాత జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్ల మధ్య ఇరుక్కున్న స్కూటీ
స్కూటీపై వెళ్తున్న ఇద్దరు 9వ తరగతి చదువుతున్న ప్రాణ స్నేహితుల్లో హేమంత్ అనే బాలుడు… pic.twitter.com/f8RwBMYShn
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2026