Viral News : హైదరాబాద్ (Hyderabad) నగరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని ప్రియుడు ఆమెకు హెచ్ఐవీ సోకిన రక్తాన్ని (HIV blood) ఎక్కించాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లాకు చెందిన మనోహర్ (24), తన మరదలైన 20 ఏళ్ల యువతి చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు.
రెండు కుటుంబాల అంగీకారంతో వారి వివాహం కూడా నిశ్చయమైంది. అయితే పెళ్లికి ముందు నిర్వహించిన వైద్య పరీక్షల్లో మనోహర్కు హెచ్ఐవీ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. యువకుడి తల్లిదండ్రులు హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులు కావడంతో యువతి తండ్రి ముందు జాగ్రత్తగా యువకుడికి కూడా టెస్ట్ చేయించాడు. దాంతో అతడికి కూడా హెచ్ఐవీ సోకిన విషయం వెల్లడైంది. దాంతొ యువతి కుటుంబం పెళ్లిని రద్దు చేసుకుంది.
దీన్ని తట్టుకోలేకపోయిన మనోహర్.. తన ప్రియురాలిపై కక్ష పెంచుకున్నాడు. యువతికి కూడా హెచ్ఐవీ సోకితే.. ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోరని, అప్పుడు తనకే ఇచ్చి వివాహం చేస్తారని కిరాతకంగా ఆలోచించాడు. ఈ క్రమంలో గత నెల 11న సిరంజిలో తన రక్తాన్ని నింపుకుని యువతి ఇంటికి వెళ్లాడు. పెళ్లి చేసుకుందాం అని మరోసారి అడిగాడు. అయినా ఆమె పెళ్లికి ఒప్పుకోకపోవడంతో బలవంతంగా ఆ రక్తాన్ని సిరంజి ద్వారా ఆమె శరీరంలోకి ఎక్కించి పరారయ్యాడు.
ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనోహర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అయితే ఈ ఘటనతో తీవ్ర మానసిక వేదనకు లోనైన బీటెక్ విద్యార్థిని.. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.