Gummadidoddi | వాజేడు, మార్చి 9 : ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామంలోని ప్రతి ఇల్లూ మంచాన పడింది. గ్రామస్థులు తెలియని రోగంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్లు, కీళ్ల నొప్పులు, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఈ గ్రామ జనాభా 300 కాగా దాదాపు 70 కుటుంబాలు ఉంటాయి. 12 రోజుల క్రితం ముగ్గురితో మొదలైన బాధితుల సంఖ్య ప్రస్తుతం 70కి చేరింది. స్థానిక వైద్యాధికారులు గ్రామానికి వచ్చి వైద్యం అందించినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇప్పటికే రక్త నమూనాలు సేకరించి ములుగు జిల్లాకేంద్రంలోని టీ హబ్కు పంపగా ఇప్పటివరకు వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో ఏం జరుగుతున్నదో తెలియక గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల కలెక్టర్ ఇలా త్రిపాఠి సైతం మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యాధికారులను ఆదేశించడంతోపాటు ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్క్లు ధరించాలని సూచించారు. ఇంత జరుగుతున్నా జిల్లా వైద్యాధికారి మాత్రం గ్రామం వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రజలు ఏ వ్యాధితో బాధపడుతున్నారు? తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా తరలించాలా? ఇక్కడే ఉంచి వైద్యం అందించాలా? అనే దానిపై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. అయితే డీఎంహెచ్వో సెలవులో ఉండి రావడం లేదా? అనే సందేహాలు ఉన్నాయి. తాజాగా కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ డీఎంహెచ్వో విపిన్కుమార్ ఆధ్వర్యంలో శనివారం వాజేడు వైద్యాధికారుల బృందం గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించింది. బాధితులను గుర్తించి రక్త నమూనాలను జిల్లాకేంద్రానికి పంపారు. అలాగే పీహెచ్సీని సందర్శించి రిజిస్టర్లను పరిశీలించారు. ఇప్పటివరకు సేకరించిన రక్త నమూనాల నమూనాలపై ఆరా తీయడంతోపాటు అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకొని సిబ్బందికి పలు సూచనలు చేశారు.