హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో యువశక్తి సత్తా చాటాలి
యువతను రాజకీయాల్లో ఎదగనివ్వకుండా తొక్కిన ఈటల
పెద్దపాపయ్యపల్లె యువకులతో విప్ గువ్వల బాలరాజు సమావేశం
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను ఓడించేందుకు ఈటలతో పీసీసీ ‘ఛీప్’ చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. యువత రాజకీయాల్లోకి వస్తే.. ఎక్కడ తన అక్రమాలు బయటికి వస్తాయోనని ఈటల పథకం ప్రకారం అణిచివేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో యువశక్తి సత్తా చాటాలని కోరారు. గురువారం మండలంలోని పెద్దపాపయ్యపల్లె గ్రామంలో యువకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ బీజేపీ నేత ఈటల రాజేందర్ గుండె దడ అదిరేలా యువత ఉప ఎన్నికల్లో పని చేయాలన్నారు. పెద్దపాపయ్యపల్లె గొప్ప అదృష్టం చేసుకుందని, ఈ ఊరి అల్లుడు ఉప ఎన్నికలో విజయం సాధించబోతున్నాడన్నారు. సీఎం కేసీఆర్ దృష్టిలో ఉండాలంటే నియోజకవర్గంలో మొదటిస్థానంలో పెద్దపాపయ్యపల్లె గ్రామ ఓట్లు ఉండాలన్నారు. అత్యధిక మెజార్టీ సాధించిన మూడు గ్రామాలకు కేసీఆర్ వరాలు ఇస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి దొంగల పార్టీకి కేరాఫ్ అడ్రస్గా ఉన్న బీజేపీలో ఈటల చేరడన్నారు. తనకు పోటీ లేకుండా ఉండేందుకు యువతను రాజకీయాల్లో ఎదగనివ్వలేదన్నారు.