హైదరాబాద్ : రైల్వే రిక్రూట్మెంట్ విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, ఆ తర్వాత జోనల్స్థాయిలో రైల్వే రిక్రూట్మెంట్స్ నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి ఆయన శనివారం లేఖ రాశారు. క్లర్క్ అంతకు కింది స్థాయి పోస్టులకు జాతీయస్థాయిలో నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ స్థాయి పరీక్షల వల్ల బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పెత్తనం సాగుతుందని, ప్రాంతీయ భాషల రాష్ట్రాల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉందని పేర్కొన్నారు.
రైల్వే పరీక్షల కోసం ఉత్తరాది కోచింగ్ సెంటర్స్ మాఫియా లాగా పని చేస్తోందని, ఆ కోచింగ్ సెంటర్స్ మాయాజాలం వల్ల తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదని తెలిపారు. 35వేల రైల్వేపోస్టుల కోసం 1.30కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, రైల్వే రిక్రూట్మెంట్ వ్యవహారంలో బిహార్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడం, విధ్వంసక పరిణామాలు చోటు చేసుకోవడం.. చివరకు బిహార్ బంద్ వరకు వెళ్లడం వంటి సంఘటనలు తనను తీవ్రంగా కలిచివేశాయని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లేఖ రాసినట్లు పేర్కొన్నారు. రైల్వే మాజ్దూర్ యూనియన్, మాజ్దూర్ సంఘ్, రైల్వేమెన్ ఫెడరేషన్, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ఈ విషయంపై తనతో మాట్లాడినట్లు లేఖలో రైల్వేమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రాంతీయ భాష తెలుగులో రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించాలని వినోద్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర భాషలోనే రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ విధానాన్ని తప్పుపడుతూ పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించానని గుర్తు చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ను జోనల్ స్థాయిలో ప్రాంతీయ భాషలోనే నిర్వహించాలని, ప్రస్తుత విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని వినోద్ కుమార్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు స్పష్టం చేశారు.