హైదాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో బంజారాలు నిర్వహించే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. బంజారా జేఏసీ నాయకుల డిమాండ్లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దృష్టికి తీసుకువెళతానని అన్నారు. శుక్రవారం మంత్రుల నివాస ప్రాంగణంలోని తన నివాసానికి వచ్చిన కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందిన బంజారా జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో వినోద్కుమార్ సమావేశమయ్యారు. త్వరలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన బంజారా జేఏసీ నాయకులతో కలిసి హైదరాబాద్లో జాతీయస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించామని బంజారా జేఏసీ నాయకులు వినోద్కుమార్కు తెలిపారు.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద తమ కులదైవం లఖిషా బంజారా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించామని వివరించారు. ఇందుకు ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించి ముందుకు సాగేందుకు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. జాతీయ స్థాయిలో బంజారా కులస్థులకు రిజర్వేషన్ విధానం ఒకేవిధంగా ఉండేలా చేస్తున్న పోరాటానికి కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. వినోద్కుమార్ను కలిసిన బంజారా జేఏసీ నాయకులలో కన్నీరాం రాథోడ్ (కర్నాటక), గుర్మీత్ రాథోడ్ (తమిళనాడు), రమేష్ రాథోడ్ (ఆంధ్రప్రదేశ్), సింపల్ రాథోడ్ (మహారాష్ట్ర), రామారావు మహారాజ్ భాటేగావలర్ (మహారాష్ట్ర), పవార్ రమేశ్ (గోవా) , అంబు రాథోడ్ (తెలంగాణ), ఎల్ రూప్సింగ్ (తెలంగాణ), తదితరులు ఉన్నారు.